15/02/2026
*బద్వేలు మండలం గుంతపల్లె గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 958/2లో పేదలకు కేటాయించిన స్థలాలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు పరిశీలించారు. కట్టడాలు కూల్చివేయడంతో తమ స్థలాల వద్దే నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులను వారు పరామర్శించి, స్థలాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని, జిల్లా కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇంటి పట్టాలు ఉండి ఏళ్ల తరబడి తమ స్వాధీనంలో ఉన్న పేదల స్థలాలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కొందరు టీడీపీ నాయకుల మాటలు విని స్వాధీనం చేసుకోవాలనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. 1996 నుంచి వివిధ దశల్లో పట్టాలు పొందిన పేదల స్థలాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి స్థలాలను చదును చేయడం అన్యాయమని, సుమారు 20 ఏళ్లుగా పేదల స్వాధీన అనుభవంలో ఉన్న స్థలాల్లో అకస్మాత్తుగా తాత్కాలిక నిర్మాణాలను తొలగించడం సరికాదని పేర్కొన్నారు. కొందరు టీడీపీ నాయకులు బినామీ పట్టాల పేరుతో ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవాలనే ఎత్తుగడలో రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని, రాజకీయాలకు అతీతంగా పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఎన్టీఆర్ కాలనీ ఏర్పాటుకు తమకు వ్యతిరేకత లేదని, అయితే పట్టణంలో అనేక అనువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ పట్టాలు ఉన్న పేదల స్థలాల జోలికి రావడం సరికాదని స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలోనే జిల్లా కలెక్టర్ను కలిసి సమస్యను క్షుణ్ణంగా వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి,మున్సిపల్ చైర్మన్ రాజగోపాలరెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్ రామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుత్తా శ్రీరాములు, రైతు విభాగం జిల్లా కార్యదర్శి చెన్నకృష్ణారెడ్డి, కౌన్సిలర్ రామ్మోహన్, వార్డు ఇన్చార్జిలు ఎంఆర్ఎఫ్ రమణారెడ్డి, సుబ్బరాజు, కృష్ణారెడ్డి, రామ్మోహన్, రామచంద్రనాయుడు, రోసిరెడ్డి, చెన్నయ్య, ఓబులేసు, గంగాదేవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.*