23/07/2021
# # కోవిడ్ వచ్చి తగ్గినాక..!!
✍️డా. ప్రతిభా లక్ష్మీ
కోవిడ్ రెండవ దశ ముగింపుకు వస్తున్న ఈ తరుణంలో, రోజు రోజుకీ, కొత్త కేసులు తక్కువగా నమోదు అవుతుండగా, కోవిడ్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండగా, మళ్ళీ తొందర్లో మూడవ వేవ్ రానుందనే చర్చల మధ్య, కోవిడ్ తగ్గినాక కలిగే సమస్యలు, వారి నుండి బయట పడే పద్ధతుల గురించి తెలుసుకుందాం.. కోవిడ్ మానవాళి మీద ఆరోగ్యపరంగానే కాక, మానసికంగా, ఆర్ధికంగా, సామాజికంగా, ఎన్నో గాయాలను మిగులుస్తుంది.
ఆర్ధికంగా ఎక్కువ నష్టం కలగకుండా, అనవసరపు పరీక్షలు చేయించకుండా, వైద్యుల సలహాల మీద సరైన మందులు వాడుతూ, వ్యాధి తీవ్రంగా అవ్వకుండా జాగ్రత్త పడడం ముఖ్యం. తరవాత కూడా అవసరం అయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను వినియోగించుకోవడం మంచిది. ఇకనైనా ముందు చూపుతో ఇన్సూరెన్స్ చేసుకోవడం, ఆరోగ్యానికి ముందు నుండే ప్రతి నెల కొంత డబ్బు కేటాయించడం, వంటివి చేయవలసిందే. ఆరోగ్య వ్యవస్థ బలపరిచే లాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవలసిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది.
కోవిడ్ సోకిన వారు, ఒంటరిగా ఒక గదిలో, లేక ఆసుపత్రి నాలుగు గోడల మధ్య రెండు వారాల పాటు ఒంటరిగా ఉండడం వల్ల మానసికంగా కృంగిపోతున్నారు. అందరూ గుర్తు పెట్టుకోవలసింది ఏంటంటే, ఇది కేవలం రెండు వారాల ఆరోగ్య సమస్య. మన జీవిత కాలంలో అది చాలా తక్కువ సమయం. కాబట్టి మనోధైర్యంతో మంచి ఆలోచనలతో ఆ రెండు వారాలు గడిపి, తదుపరి అందమైన జీవితాన్ని ఆస్వాదించాలి. సమాజ పరంగా కూడా ఒకరికి ఒకరం సహాయం అందించుకుంటూ, మనం ఈ విపత్తు నుండి క్షేమంగా బయట పడాలి.
ఆరోగ్యపరంగా, కోవిడ్ నుండి కొలుకున్నాక, ఉండే సమస్యల గురించి ఇప్పుడు చర్చిద్దాం:
*ఆయాసం: యాభై నుండి డెబ్భై శాతం ఊపిరి తిత్తులు వ్యాధి వ్యాప్తికి గురైనప్పటికీ, చాలా వరకు రోగులు పూర్తిగా కొలుకున్నాక, ఊపిరితిత్తులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. రెండు నుండి నాలుగు వారాల వ్యవధిలో, పూర్తిగా ఏ ఇబ్బంది లేకుండా అవుతున్నారు. ఆయాసం ఉన్న వారు, నెమ్మదిగా ఊపిరి తిత్తుల వ్యాయామం చేస్తూ, వాటి కెపాసిటీ పెంచుకోగలరు. కొంత మందిలో మాత్రం (అయిదు శాతం కన్నా తక్కువ) శాశ్వతమైన నష్టం మిగిలిపోతుంది (ఫైబ్రోసిస్). అలాంటి కొందరికి మాత్రం దీర్ఘకాలికంగా ప్రాణవాయువు అవసరం ఉండ వచ్చు.
*దగ్గు: కోవిడ్ వల్ల కలిగే దగ్గు కొందరికి నెల రోజుల వరకు కూడా కొద్ధి కొద్ది గా బాధించే అవకాశం ఉంది. పొడి దగ్గు ఉన్నంత వరకు, పెద్దగా కంగారు పడనవసరం లేదు. జ్వరం ఏమీ లేకుండా, ఆక్సిజన్ సరిపడా ఉంటే, హార్ట్ రేట్ నార్మల్ గా ఉంటే, కేవలం దగ్గు తగ్గడానికి ఒక టాబ్లెట్ గానీ, టానిక్ గాని తాగితే సరిపోతుంది.
*ఒళ్ళు నొప్పులు, నీరసం: చాలా రోజులు నడవకుండా ఉండడం వల్ల, అంత కన్నా ముఖ్యంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్లనే, చాలా మంది నీరసం, ఒళ్ళు నొప్పులు, బలహీనతగా ఉంటుందని చెబుతున్నారు. వారు, మెల్లి మెల్లిగా తమ దినచర్యలతో మొదలు పెట్టి, (graded physical activity) శరీరానికి వ్యాయామం అలవాటు చేయాలి. ఒకే సారి ఎక్కువ పని చేసి, ఇబ్బంది పడకూడదు.
*వాసన, రుచి తెలియక పోవడం: వాసన, రుచి, తెలియకపోవడం వంటి, చిన్న చిన్న లక్షణాలు, ఒక నెల రోజుల్లో మెల్లిగా తగ్గిపోతాయి. వాటి కోసం ప్రత్యేకంగా ఏమి చేయడం అవసరం ఉండదు. కాబట్టి కంగారు పడకూడదు.
*బ్లాక్ ఫంగస్ భయం: కోవిడ్ వచ్చి కోలుకున్న వారిని భయపెట్టిస్తున్న మరొక సమస్య మ్యూకర్ మైకోసిస్. (mucormycosis). కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో, ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో, షుగర్ అదుపులో లేని వారిలో, లేక అధిక మోతాదులో స్టీరోయిడ్స్ వాడిన వారిలో, కన్ను/ కళ్ళు వాపు రావడం, ముక్కు దిబ్బడగా ఉండడం, ముక్కు నుండి రక్తం రావడం, మొహం ఒక వైపు వాపు, లేదా నొప్పి కలగడం, ఒక పక్క తల నొప్పి, పన్ను నొప్పి, పన్ను ఊడిపోవడం, నోట్లో లేదా ముక్కులో నల్లగా మచ్చ లాగా అవ్వడం, మొదలగు లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను కలవాలి. ఇది ప్రాణాంతక జబ్బు. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకూడదు.
*దీర్ఘ కాలిక జబ్బులు: కొందరిలో కోవిడ్ వచ్చి తగ్గినాక కూడా, రక్తంలో షుగర్ ఎక్కువగా ఉంటూ, పూర్తి స్థాయిలో మధుమేహం వస్తుంది. తరుచూ షుగర్ చెక్ చేసుకొని, అధికంగా ఉంటే, వైద్యులను సంప్రదించి మధుమేహంకి చికిత్స మొదలు పెట్టడం మంచిది. అలాగే కొందరిలో, కోవిడ్ వచ్చి తగ్గినాక, అధిక రక్తపోటు నమోదవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని, బీ.పీ చెక్ చేసుకుంటూ, అవసరమైతే, మందులు వాడటం మేలు. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
*వాక్సినేషన్: వాక్సిన్ తీసుకోకుండా కోవిడ్ వచ్చి తగ్గిన వారు, లేదా, ఒక డోస్ వాక్సిన్ తీసుకున్నాక కోవిడ్ వచ్చిన వారు, మూడు నెలల తరువాత వాక్సిన్ తీసుకోవాలి. వాక్సిన్ తీసుకున్నాక కూడా కోవిడ్ వచ్చే అవకాశం లేకపోలేదు అనే నిజాన్ని గ్రహించి, మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటిస్తే, సానిటైజర్ వాడడం వంటి అలవాట్లు కొనసాగించాలి. వాక్సినేషన్ లో జరుగుతున్న ఆలస్యం వల్ల, ప్రజలలో లోపిస్తున్న జాగ్రత్త వల్ల, మూడవ దశ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకుంటూ, ఇబ్బంది పడే అవసరం రాకుండా చూసుకోవాలి.
✍️డా. ప్రతిభా లక్ష్మీ