27/03/2026
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ‘మీ ఇంటికి - మీ డాక్టర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్ --ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన "మీ ఇంటికి - మీ డాక్టర్" కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, ఐ.ఏ.ఎస్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 'మీ ఇంటికి - మీ డాక్టర్' కార్యక్రమానికి ఎంపికైన డాక్టర్ దేదీప్యను మరియు ఇతర సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమ ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్ గారు నూతనంగా ఏర్పాటైన బ్లడ్ స్టోరేజ్ బ్యాంక్ (రక్త నిల్వ కేంద్రం)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. గత అక్టోబర్ నెలలో ఈ నూతన కార్యవర్గం ఏర్పాటైనప్పటి నుండి, గతంలో కంటే వేగంగా మరియు చురుకుగా ప్రజా ఉపయోగకరమైన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
అనంతరం కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ.. నూతన బ్లడ్ బ్యాంక్ మరియు రెడ్ క్రాస్ కార్యకలాపాలను కేవలం నగరానికే పరిమితం చేయకుండా, జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని కార్యవర్గాన్ని కోరారు. జిల్లా ప్రజలందరికీ ఈ సేవలు చేరువయ్యేలా చూడాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టే ఇటువంటి మంచి కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
సమిష్టి కృషితోనే మంచి కార్యక్రమాలు: వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ గారు మాట్లాడుతూ.. "ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక సేవా దృక్పథంతో పనిచేస్తుందని, ఇందులో ఉండే ప్రతి సభ్యుడు ఏదో ఒక రకంగా సమాజానికి ఉపయోగపడుతున్నారని" అన్నారు. అలాగే నూతన కార్యవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్క సభ్యుడు మరియు లైఫ్ మెంబర్లందరి కృషితోనే ఈరోజు బ్లడ్ బ్యాంక్, 'మీ ఇంటికి - మీ డాక్టర్' లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టగలిగామని ఆయన తెలియజేశారు.
పాల్గొన్న ముఖ్య అతిథులు మరియు కార్యవర్గ సభ్యులు:
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు గారు, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ గారు, సెక్రటరీ శ్రీ జి. ప్రతీత్ గారు, ట్రెజరర్ శ్రీ జి. వి. సుబ్బారావు గార్లు పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు శ్రీ మణి శ్రీనివాస్, శ్రీ కృష్ణ కుమార్, శ్రీ సుధీర్, శ్రీ శివకుమార్, శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీ గుణశేఖర్, శ్రీ రవి గార్లు మరియు తదితరులు పాల్గొన్నారు.