Susruta Ayurvedic Hospital

Susruta Ayurvedic Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Susruta Ayurvedic Hospital, Vijayawada.

చేతిచలిమిడి ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి తినరా మైమరచిలో
08/02/2023

చేతిచలిమిడి ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి తినరా మైమరచిలో

15/06/2018

దేవుడిచ్చిన పండు దానిమ్మ
డా. జి వి పూర్ణచందు
“హరి నఖర భిన్న మత్త మాతంగ కుంభ రక్త ముక్తాపల సదృశాని దాడిమీ ఫల” తన ఎర్రని ముక్కుతో ఒక చిలుక దానిమ్మపండుని చీలుస్తున్న దృశ్యం... ‘హరి నఖం’ అంటే ‘సింహం పంజా’తో మత్తగజ కుంభస్థలాన్ని చీలుస్తున్నట్టుందిట. దాని కుంభ స్థలం మీంచి కారే రక్తంతో తడిసిన ముత్యాలహారం లోని ఎర్రని ముత్యాల్లా దానిమ్మగింజ లున్నాయంటాడో కవి.
“ఎండి పళ్లెంలోనా ఎన్నపూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారి” గురించి భువనచంద్ర ఒక పాట రాశాడు. వెన్న రాసుకుని దానిమ్మరసం పట్టిస్తే చర్మం మృదువుగా నిగనిగలాడుతుంది. అదీ దానిమ్మ రసంలో జలకమాడితే లాభం.
‘దాడకం’ అనే సంస్కృత పదానికి దంతాల వరుస అని అర్థం. సంస్కృతంలో ‘దాఢ’ అంటే కోరపన్ను, పళ్ల సమూహం అని రెండర్థాలు ఉన్నాయి. దంతాల ఆకారంలోని గింజల సమూహం అనే అర్థంలో సంస్కృతంలో దానిమ్మని ‘దాడిమః’ అని పిలిచారు. ఇది కొద్దిగా పులుపు రుచితో కూడుకున్నది కాబట్టి, తెలుగులొ ‘దాడినిమ్మ’ అన్నారు. అది జనవ్యవహారంలో దానిమ్మ అయ్యింది. గట్టి బెరడు కలిగింది కాబట్టి ‘కరక’ అని కూడా పిలుస్తారు. కరక్కాయ కూడా ఈ అర్థంలోనే ఏర్పడింది. హిందీలో ‘అనార్ అనీ, ఇంగ్లీషులో పోమెగ్రనేట్ అనీ పిలుస్తారు. ‘గ్రైన్స్’ అంటే గింజలు. దానిమ్మ పండులో విడిగా గుజ్జు అనేది లేకుండా కేవలం గింజలు మాత్రమే ఉంటాయి కాబట్టి, గింజల పండు అనే అర్థంలో ‘పోమెగ్రెనేట్’ అని పిలుస్తారు. ఈ పదం ఫ్రెంచి నుండి పాత ఇంగ్లీషులోకి వచ్చిందంటారు.
దానిమ్మ చరిత్ర
అనార్కలి కథలో దానిమ్మ(అనార్) ‘ప్రేమ’కు ప్రతిబింబం. పాశ్చాత్య సాహిత్యంలోనూ ప్రేమకు సంకేతంగా దానిమ్మ పండుని వర్ణించారు. 3,500 యేళ్ళ క్రితమే దానిమ్మను ప్రేమ సంకేతంగా చిత్రిస్తూ, సాల్మన్‘రాజు దేవాలయంలో కొన్ని కుడ్య చిత్రాల్లో దానిమ్మలూ ఉన్నాయి. దానిమ్మ పండు ఆకారంలో సాల్మన్ రాజు కిరీటం ఉండేదిట. హిబ్రూ బైబులు ‘సాల్మన్ పాట’ ప్రకరణంలో మానవుల ప్రేమబంధాన్ని సూచిస్తూ దానిమ్మని ప్రస్తావిస్తుంది. ప్రాచీన ఈజిప్షియన్లకు ఎర్రదానిమ్మ పవిత్ర ఫలం. ఫారోలు(పితృదేవతలు) తిన్న పండు అని వారి నమ్మకం. వాళ్ల సమాధుల్లో దానిమ్మ పండ్ల చిత్రాలు ఉన్నాయట. ”టుట్’ అనే ఈజిప్షియన్ రాజు సమాధిలో ఆయనతో పాటు దానిమ్మ పండ్లున్న బుట్టకూడా ఉంది.
దానిమ్మ పండ్లు తింటే అద్భుతశక్తులు సిద్ధిస్తాయని, గ్రీకుల రతీదేవి అఫ్రొడైట్‘కి ఇష్టమైన ఫలం అనీ, లైంగిక శక్తిని
ద్విగుణం బహుళం చేస్తుందనీ ప్రాచీన గ్రీకుల నమ్మకం. జొరాష్ట్రియనిజం ప్రకారం దానిమ్మ అనంత జీవితానికి సంకేతం. ప్రాచీన
ఇటలీ రాణి ”ఎలియోనోరా డి తొలెడో’ కట్టుకునే బట్టల మీద దానిమ్మపండ్ల బొమ్మలు ఉండేవిట. ఏడుగురు సంతానానికి తల్లి ఆమె. మాతృత్వానికి చిహ్నంగా ఆమె ఈ ‘దానిమ్మ చీర’ కట్టుకునేదిట.
క్రీస్తుకు స్వాగతం చెప్పేందుకు క్రిష్టమస్ రావటానికి ముందు దానిమ్మ పండుని గుమ్మానికి వ్రేలాడదీస్తారట. తెలుగు వాళ్లు బూడిదగుమ్మడి కాయని వ్రేలాడదీయటంలో ‘దిష్టి’ ఒక్కటే కాదు, ఇలా దేవతలకు స్వాగతం పలకటం కూడా అంతరార్థం ఉంది. ఎందుకంటే కూష్మాండం దేవతా ఫలమేగానీ, దెయ్యం పండు కాదు. కొన్ని ప్రాంతాల్లో డిసెంబరు 31 అర్థరాత్రి 12గంటలకు దానిమ్మ పండుని ఇంటి సింహద్వారం మండిగానికి తగిలేలా గట్టిగా విసిరి కొడతారు. ఎన్ని గింజలు ఇంట్లోకి ఎగిరిపడితే అంత శుభంట! వివాహాది శుభకార్యాల్లో కూడా దానిమ్మని పగల గొట్టే ఆచారం ఉన్నదట, దానిమ్మ గింజలు ఇల్లంతా చిందితే ఆ ఇల్లు పుత్ర పౌత్రాభివృద్ధితో కళకళలాడుతుందని! తెలుగు వాళ్లు ఎర్రగుమ్మడి కాయనీ ఇలానే పగలకొడతారు.
హిందువులు గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్టు చర్చికి దానిమ్మ పండ్లను తీసుకువెళ్లే వాళ్లూ ఉన్నారు. రోమియో జూలియట్లు కిటికీకి ఇవతల గదిలో పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నారు! కిటికీకి అవతల దానిమ్మచెట్టు మీద కూర్చుని దానిమ్మపండు తింటోంది పక్షి... ఈ రెండింటినీ ఒక సింబాలిజంగా చిత్రిస్తాడు షేక్‘స్పియర్.
ఔషధంగా దానిమ్మ
దానిమ్మ మొదట ఇరానులో పుట్టిందనీ, మొగలాయీల కాలంలో ఇండియాకి వచ్చిందనీ, ఇండియా నుండే ఇతర దేశాలకు వెళ్లిందనీ చెప్తారు. కానీ, ఇది నిజం కాదు. చరక సుశ్రుతాది వైద్య ప్రముఖులు దానిమ్మ గురించి అనేక వైద్య ప్రయోజనాల్ని వివరించారు. కాబట్టి, ఇది భారతదేశానికి ప్రాచీన ఫలమేననీ, మధ్యయుగాల్లో వచ్చింది కాదనీ తెలుస్తోంది.
దానిమ్మగింజలు పులుపు, వగరు తీపి రుచుల్ని కలిసి ఉంటాయి. వీటిలో స్నిగ్ధత ఉంటుది. ఇవి ఉష్ణవీర్యం కలిగినవి. వాంతి, వికారాలను తగ్గిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి. వాతాన్ని పోగొడతాయి. విరేచనాల నాపుతాయి. కఫాన్ని, పిత్తాన్ని పోగొడతాయి. వగరు రుచి వలన వాతం, పుల్లని రసం వలన వేడి పెరగాలి. కానీ, తీపి రుచి వలన ఈ దోషాలు అదుపులో ఉంటాయి. అందుకే, చరకుడు పుల్లదానిమ్మ పెద్దగా వేడి చెయ్యదన్నాడు. వగరు రుచి షుగరు రోగులకు అపకారం చేయదు.
ఎసిడిటిని, షుగరుని, దప్పికనీ, వేడినీ, జ్వరాన్ని తగ్గిస్తుంది. గుండె, గొంతు, ముఖ వ్యాధుల్లో మేలుచేస్తుంది. జీర్ణకోశాన్ని బలసంపన్నం చేస్తుంది. రుచిని పెంచుతుంది. వాతాన్ని, కఫాన్ని వేడినీ తగ్గిస్తుంది. పొడిదగ్గు తగ్గిస్తుంది. ఐస్ ముక్కల్లేకుండా తాజా పండ్లరసాన్ని తాగితే మేలు చేస్తుంది.
రోగకారక జీవాణువుల్ని నాశనం చేసే వృక్షసంబంధమైన రసాయనాలను ఫైటోకెమికల్స్ అంటారు. దానిమ్మరసంలో 100కి పైగా ఫైటో కెమికల్స్ ఉన్నాయి. మన శరీరం నిరంతరం వ్యాధికారిక సూక్ష్మజీవులతో పోరాడుతూనే ఉంటుంది. ఇందుకు కణజాలాల లోపల అందుబాటులోఉండే అస్త్రశస్త్రాల్ని యాంటీ ఆక్సిడెంట్లు అంటారు. ఇవి ఆరోగ్యవంతమైన
శరీరకణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. దానిమ్మ గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
కేన్సర్ వ్యాధిని తగ్గించే ఉత్తమ ఫలం ఏదంటే ఠక్కున దానిమ్మ పేరు చెప్పాలి. యాబైలు దాటిన పురుషులు తరచూ దానిమ్మ తింటూంటే ప్రోస్టేట్ కేన్సర్ రాకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానిమ్మరసంలో తగింత మిరియాలపొడి, పసుపు కలుపుకుని తాగితే కేన్సర్ వచ్చే పరిస్థితులు శాంతిస్తాయి.
ఆల్జిమర్స్ అనే మతిమరుపువ్యాధి ఉన్నవారికి దానిమ్మ గింజల్ని తరచూ పెడుతూ ఉంటే ఙ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుకునే పిల్లలకు దానిమ్మ గింజలు తెలివితేటలు పెరిగేందుకు తోడ్పడతాయి. పరిక్షల సమయంలో నైటౌట్లు చేసే పిల్లలకు రాత్రి చదువుకునేప్పుడు దానిమ్మగింజలు పెడితే కడుపులో యాసిడ్ పెరక్కుండా ఉంటుంది. చదివింది ఙ్ఞాపకం ఉంటుంది.
జూన్ 2013 మెడికల్ న్యూస్ టుడే పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో డయాలిసిస్ మీద ఉన్నరోగికి దానిమ్మ రసం ఇవ్వాలని వ్రాసింది. వాపును, విషదోషాలను పోగొడుతుంది కాబట్టి, ఇది మూత్రపిండాల మీద వత్తిడిని తగ్గిస్తుందంటున్నారు.
దానిమ్మ పండులో రోజువారీగా మనకు కావాల్సిన సి విటమిన్‘లో 40% దొరుకుతుంది. అదృష్టవశాత్తూ మనవాళ్ళు జామ, దానిమ్మ, బొప్పాయి, ద్రాక్ష, బత్తాయి లాంటి పండ్లను ఉడికించకుండా నేరుగా తినే అలవాటు ఉన్నవారు కాబట్టి, వాటి ద్వారా సి విటమిన్ దక్కుతుంది. టమోటాలో ఎంత ఎక్కువ సి విటమిన్ ఉన్నా దాన్ని వండుతున్నాం కాబట్టి, అందులోని ‘సి’ విటమిన్ మనకు దక్కకుండా పోతోంది. సి విటమిన్ కలిగిన వాటిని వండకుండా తింటే మేలు చేస్తాయి.
వండి పొయ్యి మీంచి దింపిన తరువాత ఆహారపదార్థాల్లో దానిమ్మ గింజల్ని పులుపు కోసం కలుపుకోవచ్చని చరకుడు అనుమతిచ్చాడు. పెరుగన్నం లోనూ, సాంబారు అన్నం లోనూ, రోటి పచ్చళ్లలోనూ కూర-పప్పుల్లో కూడా దానిమ్మగింజల్ని చేర్చి తింటే చింతపండు లేకుండా ఆహార పదార్థాలను పుల్లగా తినటానికి వీలౌతుంది. పేగుపూత, కీళ్లవాతం, షుగరు, బీపీ ఉన్నవారు కూడా ఇలా చింతపండుకు బదులుగా దానిమ్మగింజలు కలిసిన ఆహార పదార్థాలు తినవచ్చు.
దానిమ్మకాయల్ని పగలకొట్టకుండా ఎండిస్తారు. ఎండిన దానిమ్మకాయిని దంచి, ఇంకా ఏడు ఇతర మూలుకలను కలిపి‘దాడిమాష్టక చూర్ణం’ తయారు చేస్తారు. ఇది ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖమైంది. పేగుపూత, అమీబియాసిస్, కలరా, నీళ్లవిరేచనాలు, కడుపులో గడ్దలు వీటిమీద పనిచేస్తుంది. దాడిమాష్టక చూర్ణానికి జీర్ణకోశ వ్యాధులన్నింటి పైన ప్రభావం ఉంది. ఎసిడిటీని తగ్గించటానికి ఇది గొప్ప ఔషధం. మొలల వ్యాధిలో కూడా పనిచేస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మూత్రపిండాల రోగులకు, షుగరు రోగులకు, బీపీ రోగులకు, గుండె జబ్బులున్నవారికి షుగరు రోగులకు ఏ మందులు వాడ్తున్న వారైనా సరే అదనంగా ఈ దాడిమాష్టక చూర్ణాన్ని రోజూ రెండు పూటలా అరచెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే ఈ ప్రయోజనాలన్నీ నెరవేరతాయి. వాడుతున్న మందులు బాగా పనిచేస్తాయి.
అమీబియాసిస్ వ్యాధిలో రక్తంతో కూడిన జిగురు పడ్తున్నప్పుడు, తాజాగా దానిమ్మ గింజలు, దానిమ్మ రసం అందిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దానిమ్మగింజల్ని పెరుగులో కలిపి తినే అలవాటు వలన పేగులు శుభ్రపడతాయి. ఇప్పుడు చెప్పుకున్న జీర్ణకోశవ్యాధులు, ముఖ్యంగా అమీబియాసిసి, పేగుపూత వ్యాధుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఉదయం గానీ, రాత్రిగానీ టిఫిన్లకు బదులుగా వారంలో రెండు మూడు సార్లయినా దానిమ్మగింజలు, పెరుగు మిశ్రమాన్ని తినేవారికి పేగులు దృఢంగా ఉంటాయి. అజీర్తి కారణంగా పుట్టే వాత వ్యాధులన్నీ ఉపశమిస్తాయి.
దానిమ్మ చెట్టు బెరడు, పూలు, లేత చిగుళ్లు, దానిమ్మ పిందెలు, దానిమ్మకాయమీద బెరడు వీటికీ అమీబియాసిస్ వ్యాధిని తగ్గించే గుణం ఉంది. వాటిని ఎండించి మెత్తగా దంచిన పొడిని పాలు కలపకుండా టీ కాచుకు తాగవచ్చు. ఈ పొడితో పళ్లు తోముకుంటే చిగుళ్లు దృఢంగా ఉంటాయి. పళ్లలోంచి నెత్తురు కారటం ఆగుతుంది. దానిమ్మ వేళ్ళను దంచిన పొడిని పావు చెంచామోతాదులో కొన్ని రోజులపాటు రెండు పూటలా తీసుకుంటే, కడుపులో పురుగులు పడిపోతాయి. బద్దెపురుగు లేదా నాడాపురుగు (టేప్ వరమ్) మీద దీనికి ఎక్కువ ప్రభావం ఉంది.
చివరిగా ఒక మాట
రాజుగారొకాయన దారి తప్పి అలిసిపోయి, దప్పికతో బాధపడుతూ ఓ దానిమ్మతోట దగ్గర ఆగాడు. ఆయనే రాజని తెలియక పోయినా తోటమాలి దానిమ్మరసం తీసిచ్చాడు. దాహం, అలసట తీరాక ఆ రాజు “దానిమ్మ పళ్ళతో నందనవనంలా ఉంద ఈ తోటని స్వాధీనం చేసుకోవాలి!” అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ, ఇంకొంచెం పళ్లరసం కావాలని అడిగాడు. తోటమాలి మరో పెద్ద దానిమ్మ పండు కోసి పిండబోతే ఆశ్చర్యంగా చుక్కరసం కూడా రాలేదు. ఎన్నికాయలు కోసినా రసం రావట్లేదు. ఎందుకిలా జరుగుతోందని అడిగాడు రాజు.
“అయ్యా! దానిమ్మ పండు దేవఫలం. రాజ్యాన్ని పాలించే రాజు సహృదయతో పాలిస్తే దానిమ్మలు తియ్యరసాలు స్రవిస్తాయి. మొదటి సారి దానిమ్మను పిండినప్పుడు రాజు మంచి మనసుతోనే ఉన్నాడు. ఇంతలోనే రాజుగారికి ఏదో దుర్బుద్ధి పుట్టినట్టుంది. అందుకే, దానిమ్మలు తమ రసాలను ఉపసంహరించుకున్నాయి” అన్నాడు తోటమాలి.
రాజేకాదు, ప్రజలూ మానవతా పరిథుల్ని దాటకూడదు!

15/06/2018

సర్వ శుభాలకూ సంకేతం
పసుపు
డా. జి వి పూర్ణచందు
“ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా/ మత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయా” అంటూ, “కడివెడు నీళ్లు కళ్ళాపి చల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు/కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్లో గొబ్బిళ్ళూ” అంటూ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో/బంగారు గౌరమ్మ ఉయ్యాలో/పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో/పాలించవే తల్లి ఉయ్యాలో “ అంటూ తెలుగు తల్లులు గౌరమ్మని, బతుకమ్మని వేడుకుంటారు.
పసుపు కేవలం ఒక సుగంధ ద్రవ్యం కాదు, అది హిందువులకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి పవిత్రమైంది, శుభకరమైంది కూడా! తెలుగువాళ్ళు పసుపు ముద్దలో భగవంతుణ్ణి చూస్తారు. తెలుగిళ్ళలో పసుపు ముద్ద వినాయకుడు, పసుపు ముద్ద అమ్మవారు నిత్యపూజ లందుకుంటారు. పసిడి రంగులో ఉంటుంది కాబట్టి పసుపు ఆ పేరుతో ప్రసిద్ధం అయ్యింది. రంగుని బట్టే కాదు, గుణాన్ని బట్టి కూడా పసుపు బంగారమే!
పసుపు కలిపిన నీళ్ళు పవిత్ర జలాలు మనకి. నలుమూలలా పసుపు నీళ్ళు చల్లి పవిత్రతను ఆపాదించుకుంటారు తెలుగువాళ్ళు. పసుపు కలిసిన నీళ్ళతోనే మంగళ స్నానాలు చేస్తారు. పసుపు కలిపిన అన్నం (పులిహోర) పవిత్ర ఆహార పదార్థం. పసుపు నీళ్ళలో తడిపిన బట్టలు పవిత్రమే కాదు, మంగళకరమైనవి కూడా! మాంగల్య బంధానికి పసుపుతాడు ఒక ప్రతీక. పుస్తెలు లేకపోతే పసుపుకొమ్ము కట్టుకుని తన పవిత్రతను చాటుకుంటుంది తెలుగు ఇల్లాలు. పసుపు వాడకం మతపరమైన విషయం కాదు, అది సంస్కృతిపరమైనది. తెలుగు సంస్కృతికి పసుపు ప్రతీక.
కత్తిరించిన బట్టని అశుభానికి, పసుపు రాసిన లేదా పసుపు నీళ్ళలో తడిపిన బట్టని శుభానికీ వాడతారు. శుభాశుభాలకు తేడా పసుపు రాయటం లోనే ఉంది. పసుపు మంగళకరం. పసుపుబట్టల్నిపీతాంబరా లంటారు. పట్టుతో నేసిన బట్టయినా పసుపుతో తడిపితేనే అది పట్టుపీతాంబరం అవుతుంది.
పసుపు సుగంధ్ర ద్రవ్యమే కాకుండా బంగారపు రంగునిచ్చే రంజకం కూడా! తాలింపు తో పాటు చిటికెడు పసుపు కూడా కలిపినందువలన ఆ ఆహారపదార్ధం మంచి రంగులో ఆకర్షణియంగా ఉంటుంది. మనం ఈ ప్రయోజనం ఆశించి మాత్రమే పసుపు కలుపు తున్నాం తాలింపులో చిటికెడన్ని ఆవాలు వేసి, ఆవకున్న ప్రయోజనాలన్నీ పొందుతున్నాం అనీ, చిటిక్రెడు పసుపు వేస్తే పసుపు గుణాలన్నీ వచ్చేస్తున్నాయనీ ఇలా గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, ఈ తాలింపు మోతాదు వలన మనకు ఒరిగేదేమీ లేదు. పసుపు మౌలికంగా విషదోషాలను హరించే ఒక ఔషధం. వాపు తగ్గించే గుణాలు కూడా దీనికున్నాయి. ఈ రెండూ కేన్సర్, షుగరు లాంటి వ్యాధుల్లో పసుపును ఔషధంగా మలిచాయి.
పసుపు పని చేయని వ్యాధిలేదు. భయంకరమైన వ్యాధుల్లో కూడా పసుపు ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కేన్సర్, కీళ్లవాతం, సొరియాసిస్, ఇతర చర్మవ్యాధులు, లివర్, మూత్రపిండాల వ్యాధులు, షుగరు వ్యాధుల్లో పసుపు ప్రభావాన్ని ఆయుర్వేద శాస్త్రం బాగా విశ్లేషించింది. ఆయుర్వేద ప్రభావ వలనే తెలుగు ప్రజలు పసుపును తమ సంస్కృతి పరమైన అంశంగా గౌరవించుకుంటూన్నారు.
రోజు మొత్తం మీద 3 నుండి 5 గ్రాములవరకూ అంటే తలగొట్టు చెంచావరకూ పసుపును వివిధ ఆహార పదార్ధాల్లో కలిపి తీసుకోగలిగితే అది ఆరోగ్యానికి తలుపులు తెరుస్తుంది. పసుపు కలిసిన పెరుగు లేదా మజ్జిగ రోజూ తగుమోతాదులో తీసుకుంటే అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్, పేగుల్లో వాపు, పేగుపూత, కేన్సర్, కీళ్లవాతం, బొల్లి, సొరియాసిస్, మతిమరుపు వ్యాధి, షుగరు వ్యాధుల్లో పనిచేస్తోందనే విషయం మీద ఇప్పుడు వైద్య శాస్త్ర పరిశోధనలు దృష్టి సారించాయి.
పసుపును ఔషధం మోతాదులో తీసుకోగలిగితే పసుపు వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మానసిక ఆందోళననీ మనిషి దిగులుతో కృంగిపోయే పరిస్థితినీ నివారిస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. పసుపులో ప్రధానంగా ఉండే రసాయనం కర్క్యుమిన్ మానసిక ఆరోగ్యంపై ఔషధ ప్రభావం చూపుతుందని తేలటంతో పసుపుమాత్రలు, పసుపు క్యాప్స్యూల్స్ విపరీతంగా మార్కెట్టును ముంచెత్తుతున్నాయి.
నాడుల మధ్య సమాచారాన్ని చేరవేసే సెరటోనిన్, డోపమైన్ వంటి నాడీ సమాచార వాహికల సమతుల్యతని ఈ కర్కుమిన్ కాపాడుతుంది. అందువలన డిప్రెష్గన్, పార్కిన్సోనిజం లాంటీ వ్యాధుల్లో పసుపు ఒక ఔషధం గా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇతర దేశీయులతో పోల్చినప్పుడు మతిమరుపు వ్యాధి (ఆల్జిమర్స్) భారతీయుల్లో తక్కువగా ఉండటానికి పసుపు వారికి ఆహార ద్రవ్యం కావటమే నని కూడా తేల్చారు. ఈ ఔషధాన్ని తగుమోతాదులో తీసుకోవటం గురించి మనం ఆలోచించాలి. అరిజోనా విశ్వవిద్యాలయంలో కీళ్లవాతం మీద జరిగిన పరిశోధనల్లో పసుపును రోజూ ఆహార ద్రవ్యంగా తీసుకుంటే కీళ్లవాతం మీద బాగా పనిచేస్తోందని ఆ మధ్య ఒక నివేదికను ఇచ్చారు.
అత్యంత తాజాగా 2017 జూన్ 1 మెడ్‘టుడే వెబ్ జర్నల్లో జాన్ జాన్సన్ అనే శాస్త్రవేత్త షుగరు వ్యాధిమీద పసుపు ప్రభావం పేరుతో ఒకనివేదికను ప్రచురించారు. ఆయుర్వేద శాస్త్రంలో నిశామలకీ చూర్ణం అనే ఔషధం ఉంది. నిశ అంటే పసుపు. ఆమలకి అంటే పెద్ద ఉసిరికాయ. ఈ పెద్ద ఉసిరి కాయల లోపల గింజలు తీసేసి, బెరడునీ, దానికి సమానమైన తూకంలో పసుపుకొమ్ముల్నీ కలిపి మరాడిస్తే అదే నిశామలకీ చూర్ణం. ఇది ఆయుర్వేద వైద్యంలో షుగరు వ్యాధికి ఇచ్చే ప్రసిద్ధ ఔషధం. దీన్ని ఎవరికివారు ఇంట్లో తయారుచేసుకుని వాడుకోవచ్చు.
చాలామంది తమ కుటుంబంలో షుగరు వ్యాధి ఉందనీ తమకు రాకుండా ఏమైనా మందులు చెప్పమనీ అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకు ఈ నిశామలకీ చూర్ణం బాగా ఉపయోగపడ్తుంది. ఒక చెంచా నిశామలకీ చూర్ణాన్ని పాలలో గానీ, మజ్జిగలోగానీ కలిపి రోజూ ఒకటి లేదా రెండుసార్లు త్రాగుతూ ఉంటే మనం ఊహించని మార్పులు కనిపిస్తాయి. పసుపుతో ఉసిరి కూడా తోడు కావటం వలన ఇది అన్ని దీర్ఘవ్యాధుల్లోనూ పనిచేస్తుంది.
ఉసిరి తొక్కుపచ్చడి (నల్లపచ్చడి) కొద్దిగా ఇవతలకు తీసుకుని, దానికి సమానంగా పసుపు కలిపి ప్రతిరోజూ అన్నంలో మొదటి ముద్దగా ఒక చెంచాడు మోతాదులో కలుపుకుని తింటే అది నిశామలకీ చూర్ణంలాగానే పనిచేస్తుంది.
లివర్‘పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రోబర్ట్ మూట్స్ కీళ్ళవాతం చికిత్సలో పసుపు కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించ బోతోందని తెలిపారు. పసుపుని ఆహారంగా వాడుకుంటే నొప్పులు, వాపుల్లో తగ్గుదలని శాస్త్రవేత్తలు గమనించారు. మాంచెష్టర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన డా. అన్న్ బర్టన్- పసుపు కలిసిన కూరలు రోజూ తింటే ఎముకల వ్యాధులు తగ్గుతాయని, జాయింట్ల మీద దాడి చేసే ప్రొటీన్లను పసుపు అదుపు చేస్తుందని పేర్కొన్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో 2013లో జరిగిన పరిశోధనలు కూడా పసుపు వలన నొప్పి-వాపు తగ్గుతాయని నిర్థారించాయి.
ఒకచెంచా అల్లం ముద్ద, రెండు చెంచాలు మిరియాల పొడి, నాలుగు చెంచాల జీలకర్ర, ఎనిమిది చెంచాల పసుపు, పదహారు చెంచాల ధనియాలపొడి సరిగ్గా ఇదే మోతాదులో కలుపుకుంటే అద్భుతమైన ‘కర్రీ పౌడర్’ తయారౌతుంది. దీన్ని అన్ని వంటకాల్లోనూ కలుపుకోవచ్చు. మజ్జిగలో కలిపి తాగితే చాలా రుచిగా ఉంటాయి. ఇష్టమైనవాళ్ళు ఈ మొత్తం పొడిలో అరచెంచా ఇంగువ కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఆయుర్వేద గ్రంథాల్లో వేసవారం అని పిలుస్తారు. ఇది పసుపుని మంచికోసం, ఆరోగ్యం కోసం, వ్యాధుల్ని విషదోషాల్నీ అడ్డుకోవటం కొసం వాడుకోగల గల గొప్ప ఫార్ములా! వేసవారాన్ని రోజు మొత్తం మీద ఒకటి లేదా రెండు చెంచాల వరకూ మన కడుపులోకి వెళ్ళేలా తీసుకో గలిగితే తప్పకుండా ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ పసుపు పొడిని, ఉసిరి నల్లపచ్చడినీ సమానంగా కలుపుకుని మొదటి ముద్దగా తింటే షుగరు వ్యాధి తీవ్రత తపనిసరిగా తగ్గుతుంది. పసుపు ఔషధంగా భావించి గౌరవం, భక్తితో తీసుకుంటే అది రోగాలను నిరోధించే ఒక అమృతంలా పనిచేస్తుంది. పసుపు దివ్యామృతం మనకి!
పసుపుకొమ్ముల్ని ఎండించి, మరపట్టించిన పసుపు వాడితేనే దాని ఔషధ ప్రయోజనాలు, ఇతర సుగుణాలు కలుగుతాయి. బజార్లో దొరికే పసుపు వాడకుండా ఉండటమే మంచిది.
వేపాకునీ, పసుపునీ కలిపి నూరి దద్దుర్లు, మసూచి, పొంగు, సర్పి లాంటి వ్యాధుల్లో పొక్కులమీద రాస్తే, పొక్కులు త్వరగా ఉపశమిస్తాయి. కారంపట్టిన మరలో పసుపు కొమ్ములు పట్టకుండా జాగ్రత్త తీసుకోండి. వంటికి రాసుకునే పసుపు నేరుగా పసుపు దుంపని దంచి లేదా మిక్సీ పట్తి వాడుకోవటమే ఉత్తమం
శుద్ధమైన పసుపుపొడిని, శనగపిండినీ సమానంగా కలిపి నలుగుపెట్టుకొని స్నానం చేస్తే ఛర్మం కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది.
వేడివేడి పాలలో పసుపు, మిరియాలపొడి కలిపి తాగితే దగ్గు, కఫం తగ్గుతాయి.
అతి ఎప్పుడూ మంచిది కాదనే సూత్రాన్ని గుర్తు పెట్టుకుని పసుపును మరీ మితిమీరి వాడకుండా పరిమితంగా వాడుకోవటం అవసరం. వేడి చేసే గుణమ్ పసుపుకు ఉండి. వేడి శరీర తత్త్వం ఉన్నవారు పసుపును జాగ్రత్తగా వాడుకోవాలి.
పసుపు మనది. దానిమీద ఎవరో విదేశీయులు పేటెంటు హక్కులు పొందేముందు మన దేశంలో వేలాది యేళ్లుగా పసుపుని ఎంత గౌరవప్రదంగా వాడుకొంటున్నారో... విదేశీ శాస్త్రవేత్తలు, ఇంగ్లీషులో వ్రాసిన శాస్త్రాలే గొప్పవని భావించే కొందరు భారతీయ విద్యావంతులు తప్పక తెలుసుకోవాలి.

15/06/2018

మన ఆహార సంస్కృతి
డా. జి వి పూర్ణచందు, 9440172642
మన పూర్వులు తిన్న వంటకాలకూ ఇప్పుడు మనం తింటున్న వంటకాలకూ చాలా తేడా ఉంది
విటమిన్లు, ఇతర పోషకాల పరిఙ్ఞానం లేకపోవడంతో ఆరోజుల్లో ఏదిపడితే అది తిన్నారని, వాటి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదని, ఇప్పటి మనకి ఙ్ఞానం పెరగటం వలన మనమే చాలా నాణ్యమైన ఆహారం తీసుకుంటున్నామని భావించేవారు లేకపోలేదు. ఆనాటి ఆహారానికి, నేటి మన ఆహారాలకు ఆరోగ్యపరంగా మౌలికమైన తేడాలను తులనాత్మకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంది.
ఆనాటి మనుషులు ఏది పడితే అంటే తన శరీరానికి ఏది సరిపడితే దాన్ని తిన్నారు. మనమే ప్రస్తుతకాలంలొ ఏదిపడితే అది తింటున్నాం. అదీ తేడా?
అమెరికన్ తరహా క్యాన్డ్ ఆహారం తినేవాళ్ళకు పోషకాల విలువలు దాని ప్యాకింగ్ మీద వ్రాసి ఉంటాయి. లెక్కగా, తూకానికి తినటానికి వీలుగా ఉంటాయి. మన ఆహార పదార్థాలు అలా లెక్కించటానికి వీలైనవి కావు. వండేతీరును బట్టి పోషకాలు మారిపోతుంటాయి. ఇగురు కూరగా వండినప్పుడు, శనగపిండివేసి పకోడి కూరగా వండినప్పుడు, చింతపండు రసం పోసి పులుసుకూరగా వండినప్పుడు, బాగా మసాలాలు దట్టించి వండినప్పుడు ఆ కూర గుణాలు వేరువేరుగా ఉంటాయి. అందులో కలిపే ద్రవ్యాలు, వాటిని వండిన తీరు ఇవన్నీ మన ఆహార పదార్ధాల స్వరూప స్వభావాలను మార్చేస్తున్నాయి. సొరకాయ పులుసుకూర తిన్నప్పుడు తినేది చింతపండు పులుసుని, తిట్టేది సొరకాయని అవుతుంది. వీటికి అదనంగా మనం కల్తీ పసుపు, కారం, నెయ్యి, నూనెల్ని, రంగురసాయనాల్ని, వెర్రెత్తినట్టు అల్లం వెల్లుల్నీ చేర్చి తింటూ వాటిలో పోషక విలువలగురించి మాట్లాడటం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవటం లాంటిదవుతుంది.
అన్నం అంటే భక్తిభావం ఉన్నవారు అన్నాన్ని ఇష్టారాజ్యంగా వండలేరు. దేవుడికి నైవేద్యం పెట్టి తను తినేవారుకూడా ఇష్టారాజ్యంగా వండి దేవుడికి పెట్టలేరు. ఆధునిక యుగంలో ఆహారం అప్రథానమైన విషాయం అయ్యింది. అన్నానికి బదులుగా తినే టిఫిన్లు, కర్రీలు, రోటీలు చాలా light food అనే భావన ఎక్కువమందిలో ఉండటాన అన్నం చిన్న చూపుకు గురౌతోంది.
2000వ మిలీనియం సంవత్సరం తరువాత మన సమాజంలో వాణిజ్య సంస్కృతి బాగా పెరిగిపోయాక, మన ఆలోచనావిధానంలో విచిత్రమైన మార్పులొచ్చాయి. అది మన ఆహార సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అమెరికన్ తరహా జీవిఅ విధానం మీద మోజు పెరిగింది. దేవుడికి ‘హాయ్, బాయ్’ చెప్పి నక్షత్రాల చాక్లేట్ నైవేద్యం పెట్టి వచ్చే తీరులో మనలో వస్తున్న మార్పుల్ని మనం గమనించుకుంటున్నామా అనేది ప్రశ్న.
మన పూర్వులు తిన్న ఆహారం, నిన్నటిదాకా మన ఆహారం, ఇప్పటి మన ఆహారం వీటిలో ఎంతతేడా ఉందో మనం పరిశీలించి చూసుకోవాల్సిందే! వాళ్ళు ఆరోగ్యదాయకంగా తిన్న ఆహారపదార్ధాలన్నీ మన ఆహార సంస్కృతికి సంబంధించిన విషయాలు. మన ఆహారసంస్కృతి మన దేశీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందుతుంది. ప్రపంచంలో ఏ దేశానికైనా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. మన సంస్కృతే మనల్ని నడిపిస్తోంది.
సంస్కృతి గురించి మాట్లాడటాన్ని మతమౌఢ్యంగా భావించే రోజులు పోయాయి. మనిషి జీవితాన్ని నాణ్యమైన రీతిలో నడిపించేది సంస్కృతి అనే కొత్త నిర్వచనం ఇప్పుడు శాస్త్రవేత్తల మస్తిష్కంలో అనేక కొత్త ఆలోచనలకు కారణం అవుతోంది. ప్రపంచ సంస్కృతులను ధ్వంసం చేయటమే ధ్యేయంగా ప్రపంచ వ్యవహారాలు నడుపుతున్న అమేరికాలోనే ప్రాచీనమైన ప్రతి జాతికీ ఒక సంస్కృతి ఉంటుందనీ, దానికి అనుగుణంగా నడుచుకోవటం ఆరోగ్యకరమనే ఆలోచనలు మొదలయ్యాయి. ఈ ఆలోచనలను చేస్తోంది సామాజిక వేత్తలో సాహితీ వేత్తలో కాదు, సాక్షాత్తూ వైద్య శాస్త్రవేత్తలు.
ప్రతి వ్యక్తీ తన జాతీయతను, జాతీయ సంస్కృతిని తెలుసుకుని దాన్ని పాటించేవారు నిస్సందేహంగా ఆరోగ్య దాయక మైన ఆహారాన్ని తీసుకుంటున్నారని ఇటీవల చేసిన ఒక పరిశోధనలో తేలింది. Personality and Social Psychology పత్రిక తాజా సంచిక(10 August 2016)లో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. “అమెరికాలో కూడా ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని గౌరవించేవారి ఆహారంలో పళ్ళు, కూరగాయలు, చిట్టు-తవుడు తియ్యని ధాన్యాలు, సంతృప్త కొవ్వు పదార్ధాలు, తేలికపాటి మాంసకృత్తులు, గుడ్లు వగైరా ప్రధానంగా ఉంటాయి” అని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది.
Center for Disease and Prevention (CDC) సంస్థ అమెరికన్ సామాజిక వ్యవస్థ మీద ఈ అధ్యయనం చేసింది. ఆహారం మీద అదుపు లేకపోవటమే స్థూలకాయం, బీపీ, షుగరు వ్యాధులు వెల్లువెత్తుతున్నాయని, సంస్కృతి ఈ అదుపునే కాదు, మార్గదర్శకత్వాన్ని కూడా ఇస్తుందనీ ఈ నివేదిక చెప్తోంది. అమెరికా లాంటి అత్యాధునిక నాగరిక దేశంలో 14-18% మంది మాత్రమే పళ్ళు, కూరగాయలతో కూడిన ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని ఈ నివేదిక చెప్తోంది. అమెరికన్ సంస్కృతిని తెలుసుకుని పాటించ గలిగితే గానీ ఆరోగ్యదాయక ఆహారం సాధ్యం కాదు” అనేది ఈ నివేదిక సారాంశం. ఇండియన్లు, జపానీయులు తమ సంస్కృతిని ప్రేమిస్తారనీ, సంస్కృతికి తగ్గ ఆహారాన్ని సేవిస్తారని కూడా ఈ నివేదిక చెప్తోంది. అమెరికన్ సంస్కృతిలో ఇష్టారాజ్యంగా తినే అవకాశం ఉండటమె ఈ అపకారానికి కారణం "In the U.S., having choice and control and being independent are very important" అని ఈ నివేదిక తేల్చింది.
ఇండిపెండెన్స్(వ్యక్తిగత స్వేఛ్ఛ) కన్నా ఇంటర్ డిపెండెన్స్(అందరూ కలిసి ఒకరికోసం ఒకరుగా బతకటం) అనేది జపానీ వ్యవస్థలో కనిపిస్తుంది. కుటుంబంలో అందరూ సమానంగా పంచుకుని తినేప్పుడు ఆరోగ్యదాయకమైన అంశాలకు ప్రాధాన్యత సహజంగా ఉంటుంది. సామాజిక బంధం, మానవ సంబంధాలనేవి కోల్పోయిన వ్యవస్థ ఆరోగ్యదాయకమైన అంశాలన్నీ కోల్పోవటమే జరుగుతుందనే హెచ్చరిక కూడా ఈ నివేదికలో ఉంది.
ఇదంతా వాస్తవంలోకి రావాలంటే వ్యక్తుల్లో సాంస్కృతిక స్పృహ (cultural fit) ఉండాలి. సంస్కృతి అంటే మత ఛాందసం కాదు. సంస్కృతి అంటే నాణ్యమైన జీవన విధానం. మనిషి నడవడిని అతను జన్మించిన సంస్కృతి ప్రభావితం చేస్తుంది. అది ఆరోగ్యదాయకమైన జీవన విధానాన్ని ప్రేరేపిస్తుంది. ఆరోగ్యదాయక మైన ఆహారం, ఆరోగ్య దాయకమైన ప్రవర్తనలను సంస్కృతి అందిస్తుంది. సాంప్రదాయకమైన సంగీతం, సాహిత్యం, నాట్యం వగైరా జీవ భౌతిక పరమైనవి (బయలాజికల్) కావు. సంస్కృతి పరంగా సంక్రమించే విద్యలు కళలు. అవి పరాయీకరణం చెందకుండా దేశీయంగా వర్ధిల్లినప్పుడు సమాజ ఆరోగ్యం కూడా వర్ధిల్లుతుంది.
ఈ సిద్ధాంతానుసారం తెలుగువారి వరకూ ఆలోచిస్తే, మన ఆహారంలో మన సంస్కృతిని కాదని, పరాయి సంస్కృతిని తెచ్చిపెట్టుకున్న అనారోగ్యకరమైన అంశాలు చాలా ఉన్నాయి. కొన్నింటిని పరిశీలిద్దాం.
మనది మౌలికంగా ముప్పొద్దుల భోజన సంస్కృతి. కానీ, మనం ఉదయం పూట మెతుకు తగలకూడదనే సిద్ధాంతాన్ని ఎరువు తెచ్చుకున్నాం. ఎప్పుడో పండుగకో, పబ్బానికో ఒకసారి సరదాగా తినవలసిన పిండివంటలను రోజూ అల్పాహారం అనే భ్రమలో కావాలని తింటున్నాం. ఇది మన సంస్కృతికి వ్యతిరేకమైన అనారోగ్యకర అంశం. బాలకృష్ణుడు గోపబాలురతో గుండ్రంగా పద్మాకారంలో కూర్చుని తిన్నది పెరుగన్నమేగానీ, రెండిడ్లీ సాంబారు కాదు! చలిదన్నం అంటే పెరుగన్నం. నిన్నటి పాచిపోయిన అన్నం అనేది దుర్మార్గమైన అర్ధం. ఉదయాన్న పెరుగన్నం లేదా చల్ల అన్నం తినటం మన సంస్కృతి.
మన వంటింట్లోకి మిరప కాయలు 15-16 శతాబ్దాల కాలంలో ప్రవేశించాయి. అంతవరకూ కారానికి వాడుకున్న మిరియాలు వగైరా తెలుగు నేలమీంచి పూర్తిగా నిష్క్రమించాయి. మిరపకాయల రాకతో వంటింట్లోకి చింతపండు కూడా ప్రవేశించింది. అల్లం వెల్లుల్లి అతివాడకానికి ఈ మిరపకాయలు చింతపండు దోహద పడ్దాయి. గత 300 యేళ్ళ కాలంలో మన వంటకాలు మన సంస్కృతి కట్టును దాటిపోయాయి. ఇప్పటి తరం ఇదే మన సంస్కృతి అనే భ్రమలో జీవిస్తున్నారు.
చైనా నూడుల్సు, ఇటాలియన్ పీజ్జాలు ఇతర ఝంకు ఆహారాల పట్ల యువతరంలో వ్యామోహం ఎక్కువయ్యింది. పెద్దలు కూడా పిల్లల్ని పిజ్జా సంస్కృతి లోంచి బయటకు తేలేకపోతున్నారు.
పెద్దలు ఇంట్లో వండుతున్న బజ్జీలు, పునుగులు, పూరీలు వగైరా కూడా ఈ ఝంకు ఆహారపదార్ధాలేననే సంగతి మనం మరిచిపోకూడదు. పొద్దున్నపూట మైసూరుబజ్జీ తినటం ఇప్పుడు కొత్తగా మొదలైన ఒక ఫ్యాషన్. మనం ఏది ఇష్టంగా చేస్తే అదే నాగరికత అనుకునే ఒక ధోరణికి ఇది తార్కాణం. బజ్జీ, పూరీ, వడ, దోసె ఈ నూనె పదార్థాలు ప్రొద్దున్నే తినటం నేటి గొప్ప. అలా తిననివాళ్లని అనాగరికులనటం ఇంకో గొప్ప.
మన పూర్వులు కూడా బట్టర్ నాన్లు, బర్గర్లు తిన్నారు. 14 వశతాబ్ది నాటి శ్రీనాథుడు ఉదహరించిన వంటకాల పట్టికలో ఇప్పటి ఉత్తరాది వంటకాలుగా మనం భ్రమిస్తున్నవన్నీ ఉన్నాయి. అయితే వాటిని జన్మానికో శివరాత్రిలా వన్స్ ఇన్ ఎ బ్లూమూన్ లా, పండగలప్పుడు, వివాహాది శుభాకార్యాలప్పుడు మాత్రమే తిన్నారు. ఇప్పుడు మనం రోజూ తింటున్నాం. రోజూ విందుభోజనంలా పిండిపదార్థాలను, పిండివంటలను తినటం వలన షుగరువ్యాధి, స్థూలకాయం మనల్ని ఆవహిస్తున్న సంగతి మరిచి పోతున్నాం. ఉదయాన్న టిపిన్లకు బదులు హాయిగా పెరుగన్నం తిన్నవాడికున్నంత శరీర దృఢత్వం రెండిడ్లీ సాంబారు తిని సరిపెట్టుకునేవాడికో, ప్లేటు మైసూరుబజ్జీ తినేవాడికో ఉంటుందంటారా?
రోజుకో 200 సంపాదించే వ్యక్తి టిఫిను కోసం కనీసం 40 రూ. వెచ్చిస్తున్నాడు. బలహీన, అనారోగ్యకర టిఫిన్లను అధిక ధరలకు కొని తింటున్నాడు. దానివలన తన పనితనాన్ని, ప్రతిభనూ ప్రదర్శించలేక జీవితంలో వెనుకబడి పోతున్నాడు.
ఈసురోమంటూ మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని వందేళ్లక్రితం గురజాడ జాతిఉనిఉ ప్రశ్నించాడు. రెండిడ్లీ సాంబారుతో కడుపునింపుకొనేవాడు దీనికి సమాధానం చెప్పాలి. అదేగొప్ప తిండి అని ప్రోత్సహించేవాడు అందుకు బాధ్యత వహించాలి. ఉదయం పూట మెతుకు తగలకూడదని ప్రచారం చేసేవారు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం.
సంస్కృతిని అర్ధం చేసుకోవటం అవసరం. అది మన దేశ కాలమానాల కనుగుణంగా ఏర్పడిన ఒక జీవన విధి. దాన్ని ఎద్దేవా చేయకుండా, అందులోని రహస్యాన్ని అర్థం చేసుకోగలగాలి.
ఉగాది పచ్చడి తినటం మత ఛాందసం అనేవాడు మూర్ఖిస్టు అవుతాడు.

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Susruta Ayurvedic Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram