04/11/2020
రులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.
స్మరణాత్ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే
వీటిని అందరమూ అక్కడకు వెళ్ళి దర్శించుకోలేకపోవచ్చు, కనీసం ఇలా చిత్రాలలో దర్శించి, వాటి వివరాలు తెలుసుకున్నా అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.
కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు. గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది.
ఇది తమిళులకు కార్తీక మాసము, కార్తీక మాసములో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచల గిరిపైన మహా జ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. దీనినే " కృత్తికా దీపోత్సవం " అంటారు. ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను, వత్తిని " జ్యోతి నాడార్ లేక దీప నాడార్ " అని పిలువబడే వంశస్తులు మాత్రమే అందజేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి అరుణాచలానికీ వచ్చే భక్తులు అందజేస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. షుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపము దర్శనమిస్తుంది.
వీలైతే అరుణాచలం వెళ్లి ప్రత్యక్షంగా జ్యోతిని దర్శించు కోవడం అత్యంత పుణ్యప్రదం. ఈ జ్యోతిని దర్శించేందుకు దేశ విదేశాలలో ఉండే భక్తులు కూడా అరుణాచలం చేరుకుంటారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం విచ్చేస్తుంటారు. గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ " అరుణాచలం " అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది. ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకూ వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ, సంచిత పాప కర్మలు సైతం పటా పంచలవుతాయనీ, ఎవరైనా మరణించి నరకానికి వస్తే, వారి జీవితంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడటా. ఒకవేళ వారి పుణ్యం కొలదీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినట్లయితే, వారి జీవితాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణకు ముందు, అరుణాచల గిరి ప్రదక్షిణ తరువాతగా విభజించి, గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాశులను లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉన్నది.
అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు.