Cnp Tanuku

Cnp Tanuku కేర్ న్యూరో సైకియాట్రీ హాస్పిటల్

14/01/2024
కేర్ న్యూరో సైకియాట్రీ హాస్పిటల్. అపాయింట్‌మెంట్ కోసం మాకు కాల్ చేయండి - +91 9703243222
13/12/2020

కేర్ న్యూరో సైకియాట్రీ హాస్పిటల్. అపాయింట్‌మెంట్ కోసం మాకు కాల్ చేయండి - +91 9703243222

ఇంటర్నెట్ వ్యసనం కౌన్సెలింగ్
ఫోన్ వ్యసనం కౌన్సెలింగ్

13/12/2020

నేడు కంప్యూటర్లు మరియు తత్సంభదిత ఎలక్టానిక్ పరికరల ప్రతి మనిషి జీవితం లో నిత్యవసర వస్తువులయిపోయినాయి .
అవి లేనిదే రోజు ముందుకు నడవదు . దేనినైనా అతిగా వాడడం వలన దాని ప్రభావము మన ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది . రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్‌ నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ.. 55 ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది. ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కంప్యూటర్‌ కీళ్లనొప్పుల ముప్పు తగ్గించుకోవటానికి గంటకు ఒకసారైనా కంప్యూటర్‌ ముందు నుంచి లేచి, కాసేపు అటూఇటూ తిరగటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం చేసే ముందు, తర్వాత వామప్‌ చేయాలని.. మోకాళ్లకు పట్టీల వంటివి ధరించాలని చెబుతున్నారు.

కంప్యూటర్ పై పని చేసే వారికి సాదారణముగా కలిగే ఆరోగ్య సమస్యలు .:
కంప్యూటర్ విజన సిండ్రోం - సి.వి.య స్ ,
రిపిటేటివ్ స్టిములస్ ఇంజురీ - ఆర్.యస్.ఐ .,
కండరాల నొప్పులు ,
నిద్రపట్టక పోవడం ,
సరిఅయిన వ్యాయామము లేక బి.పి , సుగర్ జబ్బులు వచ్చే ప్రమాదము ,

ఆర్‌ఎస్‌ఐ :ఒకే విధమైన పనిని ఎడతెరిపి లేకుండా చేస్తూ వుండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కన్పించడాన్ని ఆర్‌ఎస్‌ఐ (Repetitive Stress Injury) అంటారు. ఉదాహరణకి కంప్యూటర్‌ కీబోర్డ్‌తో అదేపనిగా టైప్‌ చేయడం వల్ల చేతివేళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. సిటిఎస్‌ (Carpal Tunnel Syndrome) అనేది ఒక రకమైన ఆర్‌ఎస్‌ఐ. చేతి మధ్య నుండి మణికట్టు ద్వారా వెళ్ళే నరంపై ఒత్తిడి పెరగడం వల్ల చేతిలో సూదులతో గుచ్చుతున్నట్లుగా బాధ కలగడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను సిటిఎస్‌ అంటారు. దక్షిణాసియా దేశాలతో పోల్చితే కంప్యూటర్ల వాడకం ఎక్కువగా వున్న యురోపియన్‌ దేశాల్లోనే ఎక్కువమంది ఈ వ్యాధి వున్నట్లు అంచనా. కేవలం చేతులకేకాక శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భుజాలు, మెడలోని కండరాలు, అరికాళ్ళు, మోకాళ్ళు, నడుముభాగంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

అసలు ఆర్‌ఎస్‌ఐ ఎందుకు వస్తుంది? ఎంతవరకు దీన్ని ప్రమాదకారిగా గుర్తించవచ్చు? వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలమా? అనే అంశాలపై జరిగిన ఓ సర్వేలో వెల్లడైన అంశాలు- ఎడతెరిపిలేకుండా టైప్‌ చేయడం, అతి ఎక్కువ సమయం టైప్‌ చేయడం, తల తిప్పకుండా పనిచేయడం, మణికట్టు వంచి పనిచేయడం, అదే పనిగా మౌస్‌ వాడడం, కదలకుండా ఒకేచోట కూర్చొని వుండడం, కాళ్ళ కింద సపోర్ట్‌ (ఫుట్‌ రెస్ట్‌) లేకుండా కూర్చోవడం, అతి తక్కువ లేక అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం

సివిఎస్‌ : ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. దీన్ని మామూలు భాషలో 'పొడి కళ్ళు' అంటారు. కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్‌ లక్షణాలు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్‌ మోనిటర్‌ నుండి జనించే రేడియేషన్‌ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్‌ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్నోస్ట్రెస్‌ (Technostress) : దీనివల్ల కంప్యూటర్‌ ప్రొఫెషనల్స్‌లో ఒకరకమైన టెన్షన్‌, అసహనం, ఇతరులపై సానుభూతి లోపించడం, మెషీన్‌లా పనిచేయడం వంటి లక్షణాలు గోచరిస్తాయి.

టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌ : ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ వాడేవారికి 'టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌' అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని 'స్విస్‌' అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ నుంచి 125 ఫారిన్‌హీట్‌ (52 సెంటీగ్రేడ్‌) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్‌ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్‌ అన్‌డ్రెస్‌ అర్నాల్డ్‌ పీటర్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు నిద్ర పట్టకపోవడం, సరైన వ్యాయామం లేక బిపి, సుగర్‌ వంటి జబ్బులతోపాటు ఊబకాయం వంటి సమస్యలకు లోనుకావడం జరుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ఉపయోగించేవారు అందుకు తగినట్లుగానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలూ తీసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధులు నిర్ణీతస్థాయిని మించి ముదిరిపోతే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, - యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది, -
పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, - ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, -
కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, - సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, -
ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, -
కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి, -
కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి, -
కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి, -
కాళ్ళకి కూడా సపోర్ట్‌ (ఫుట్‌రెస్ట్‌) వాడాలి, -
ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్‌ తీసుకోవాలి, -
ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.

పిల్లలకు మానసిక సమస్యలు :

మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి శారీరకశ్రమ ఎంతగానో ఉపకరిస్తుందన్నది తెలిసిన విషయమే. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది. అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవటంపై అంతగా దృష్టి పెట్టలేదు. దీనిని గుర్తించటానికే బ్రిటన్‌ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు. అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసుకున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారిలో మానసిక సమస్యలు సుమారు 60 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా ఉంటున్నాయి. టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో పాటు గంట కన్నా తక్కువసేపు వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరక శ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబంతో పిల్లలు కలిసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.

13/12/2020

డెమన్షియా అంటే ఒక రోగం కాదు, అనేక రోగాల సముదాయం. మనిషి మెదడు లోపల కొన్ని కణాలు దెబ్బతినడంవల్ల మనిషిలో అనేక నైపుణ్యాలు కనుమరుగైపోతాయి. ముఖ్యంగా తెలివితేటలు, నేర్చుకునే సమర్థత, సమస్యా పరిష్కారశక్తి వంటివి బాగా తగ్గిపోతాయి. ఎంత పాండిత్యంగల వారైనా దీని బారిన పడ్డారంటే భాష మీద ఆధిపత్యం, ఏకాగ్రత, భాషాచాతుర్యం, పరిశీలనాశక్తి వంటివి దారుణంగా దెబ్బతింటాయి. దీనికితోడు మనిషి ప్రవర్తనలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. డెమన్షియావల్ల జ్ఞాపకశక్తిలో లోపం ఏర్పడి ఆ మనిషికి మరుపు మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు.
బాగా ముదిరితే ... ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

మనిషిలో వచ్చే మార్పులు
ఈ డెమన్షియా ముదురుతుంటే భార్యని అమ్మా అని లేదా పిన్నీ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని వస్తువుల పేర్లు గుర్తుకురాక అది..ఇది అని మాట్లాడుతారు. ఎవరికి కనిపించనిది, వినిపించనిది తనకు కన్పిస్తున్నట్లు, విన్పిస్తున్నట్లు భ్రమకు లోనవుతూ ఉంటారు.ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. మగతగా, అయోమయంగా తయారవుతారు .

ఈ డెమన్షియాలో ఎన్నెన్నో రకాలు వున్నాయి. ఒకొక్కదానికి ఒకొక్క రకం లక్షణాలు.

ఆల్‌జైమర్ డెమన్షియా : .
డెమన్షియా వచ్చిన వారిలో సగం మందికి పైగా ఈ ఆల్‌జైమర్ డెమన్షియా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో పూర్తిగా ఇంకా తెలియరాలేదు. కాకపోతే కొంతమంది దీనిని వారసత్వపు సమస్యగాను, మరికొందరు ఆడవారికి ఎక్కువగా వస్తుందని అంటారు.

ప్రీ సెనైల్ డెమన్షియా : ఈ డెమన్షియా మనిషికి 40 ఏళ్ల వయసులోనే వచ్చిందంటే దానిని ప్రీ సెనైల్ డెమన్షియా అంటారు. .

సెనైల్ డెమన్షియా : ఈ డెమన్షియా మనిషికి 60 ఏళ్ల వయసులో వస్తే సెనైల్ డెమన్షియా అంటారు.

క్రాజోఫెల్ట్ జాకబ్ డిసీజ్ డెమన్షియా : క్రాజోఫెల్ట్ జాకబ్ డిసీజ్ గురించి చెప్పుకోవాలి. ఇది మెదడు క్రమంగా క్షీణిస్తూ ఎదురయ్యే ఒక విధమైన డెమన్షియా. ఇది రావడానికి ఒక కారణం మేడ్ కౌ డిసీజ్ వున్న ఆవు మాంసం తినడం అని వైద్యపరిశోధకుల అభిప్రాయం.

కారణాలు :
శరీరంలోకి అల్యూమినియం చేరి దాని విషప్రభావం వల్ల మెదడు దెబ్బతిని ఈ డెమన్షియాకు కారణం అవుతోందని కొంతమంది వాదన.
మెదడులో కంతులు,
తలకు గాయాలు,
ఎయిడ్స్,
పార్కిన్‌సన్ వ్యాధి
మెటబాలిజం సమస్యలు,
ఆహార లోపాలు-విటమిన్‌ బి 12 లోపము ,
కొన్ని మందులు వాడకము వల్ల -- cimetidine , some cholesterol lowering medicines .
నిరంతర మద్యపానము నకు బానిస ,
వంటివి వచ్చినప్పుడు కూడా వారికి డెమన్షియా వచ్చే అవకాశం ఉంటుంది.ఇతర ఇన్‌ఫెక్షన్సువల్ల కూడా కొంతమందికి ఈ డెమన్షియా సమస్య వస్తుంది.

చికిత్స
మెదడును మరమ్మత్తుచేయడానికి మందులు వున్నాయి. అయితే అవి వ్యాధిగ్రస్థునికి ఏమేర పనిచేస్తాయన్నది అనుమానమే. పిరాసిటామ్, వైరిటినాల్, హైడర్జిన్ లాంటి మందులు కొంత మేలుచేస్తున్నట్లు రికార్డులవల్ల తెలుస్తోంది.
వైద్యుని పర్యవేక్షణలో చికిత్స ఎంతో అవసరం. దీనికితోడుగా ఆహారం, వ్యాయామం, ఆటవిడుపు కార్యక్రమాలు కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. వీరికి ప్రధానంగా సపోర్టివ్ సైకోథెరపీ మంచిది.

ముందు జాగ్రత్తలు(prevention) :
ధూమపానము మానివేయాలి. ,
మద్యపానము మానివేయాలి ,
బి.పి . ఉంటే అదుపులో ఉంచుకోవాలి ,
మధుమేహము ఉంటే .. అదుపులో ఉంచుకోవాలి ,
కొవ్వు పదార్ధాలు తక్కువగా తినాలి ,
వ్యాయామము క్రమము తప్పకుండా(regular) చేయాలి .
updates:

వృద్ధాప్యంలో మతిమరుపు సహజమే. కానీ 30ల్లో ఉన్నవారూ దీని బారినపడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది.

* 6% మందిలో ముప్పైల్లోనే మతిమరుపు ప్రారంభమవుతోంది.
* 10% మందిలో నలబైల్లోనే జ్ఞాపకశక్తి తగ్గటం మొదలవుతోంది.
* 40% మంది తమకు చాలాకాలంగా తెలిసిన వ్యక్తుల పేర్లను తరచుగా మరచిపోతున్నారు.
* 20% మంది తాళంచెవులను, కళ్లద్దాలను ఎక్కడ పెట్టామో గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారు.
* 10% మంది ఏటీఎంలలో తమ రహస్యసంఖ్య(పిన్‌) గుర్తుకురాక ఇబ్బంది పడుతున్నారు.

నిజానికి చిన్నవయసులో ఇలాంటి మతిమరుపు పెద్దగా హాని కలిగించేదేమీ కాదు. కానీ కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో జ్ఞాపకశక్తి తగ్గిపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుస్తకాలను చదవటం.. చిక్కు సమస్యలను, పదకేళీలను పూరించటం.. హోంవర్కు చేయటంలో పిల్లలకు సాయపడటం.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం.. వంటి పనులు మతిమరుపు బారినపడకుండా దోహదపడతాయని సూచిస్తున్నారు.

వేళకు తింటే మతిమరుపు దూరము :
వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపు (డిమెన్షియా)తో బాధపడేవారు వేళకు తినాలనే సంగతినీ మరచిపోతుంటారు. కొన్నిసార్లు తిన్నారో లేదో కూడా చెప్పలేని అయోమయంలో ఉంటారు. దీంతో సరైన పోషకాలు అందక ఇతరత్రా సమస్యలూ ముంచుకొచ్చే అవకాశముంది. ఇలాంటి వారికి సమయానికి ఆహారం తీసుకునే విషయాన్ని గుర్తుంచుకునేలా శిక్షణ ఇస్తే మంచి ఫలితం కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. దీంతో శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుంగుబాటు లక్షణాలూ తగ్గుముఖం పడుతున్నట్టు తైవాన్‌ పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా కొందరికి మామూలు చికిత్స, మరికొందరికి చికిత్సతో పాటు ఆహార అలవాట్లను గుర్తుంచుకునేలానూ శిక్షణ ఇచ్చారు. ఇలా జ్ఞాపకశక్తి శిక్షణ తీసుకున్న వారిలో పోషకాల మోతాదులతో పాటు శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) కూడా మెరుగుపడినట్టు తేలింది. అలాగే వీరిలో కుంగుబాటు లక్షణాలూ తగ్గుముఖం పట్టటం విశేషం. అందువల్ల డిమెన్షియా బారినపడ్డ వారిలో బలహీనత, పోషకాలు తగ్గిపోవటం, కుంగుబాటు లక్షణాల వంటివి కనబడితే ఇలాంటి జ్ఞాపకశక్తి సంబంధ శిక్షణ ఇచ్చే పద్ధతి పాటించటం మేలన్నది పరిశోధకుల సూచన.

Brain exercises in dementiaమతిమరుపునకు మెదడు వ్యాయామాలు

ఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది సామెతే కాదు అక్షరాలా వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడ కుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతోంది. పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. చేయటానికి మెదడుకు పని ఏముంటుంద నుకుంటారు? కానీ మీరు మీ చేతులు, కాళ్ళు ఏవి కదపాల న్నా అవి మీకు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలలో విచక్షణతో మీరు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసుకుంటారు. ఇంత ప్రధానమైన ఈ శరీర భాగానికి మనం పదును పెట్టాలి. అందుకుగాను మీ మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయస్సు పైబడు తోందంటే మనమందరం మెదడుకు గల పదును కోల్పోతూ ఉంటాం. కానీ మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. వయసు పైబడుతున్నపటికీ మీలో మతిమరపు వ్యాధి రాకుండా ఉంటుంది.

మీ మెదడుకు ఐదు ప్రధాన వ్యాయామాలు
మెమొరీ గేమ్‌ చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందంటే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరోమారు జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు. విచక్షణ మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియ కుండానే విచక్షణ చూపుతాం. కనుక ప్రతి పని మీరు కొంత లాజిక్‌తో చేయాలి. అందుకుగాను, కొంత రాజకీయాల వంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. నిర్ణయాలకు రావాలి. ఇప్పుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.
శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూపలేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్త విషయాలు మాట్లాడినా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.

పజిల్స్‌ చేయటం ఈ పని పిల్లలదనుకుంటాం. కానీ పిక్చర్‌ పజిల్స్‌, సుడోకు వంటివి మెదడుకు మంచి వ్యాయామం. లేదంటే, బజారులో తిరిగేటప్పుడు దుకాణాల బోర్డులు చదవండి. వాటిని మరల అదే వరసలో గుర్తు చేసుకోండి. భాషాపర వైపుణ్యం మెదడు వ్యాయామాలలో బ్రెయిన్‌కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటి వరకూ మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గ దర్శకంగా అది బాగా వచ్చినవారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగువుతుంది. బ్రెయిన్‌కు మంచి వ్యాయామంగా ఉంటుంది. ఈ మెదడు వ్యాయామలు మిమ్మల్ని రోజువారీ జీవితంలో ఎంతో చురుకుగా ఉండేలా చేస్తాయి. కనుక నేటి నుండే మీ మెదడుకు పని కల్పించండి. తెలివైన వారుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.

13/12/2020

కుంగుబాటుకు సైకిల్‌ బ్రేక్‌-- తరచూ కుంగుబాటు బారిన పడుతున్నారా? అయితే సైకిల్‌ తొక్కటం మొదలెట్టండి. శారీరకశ్రమతో కూడిన ఇలాంటి వ్యాయామాలు ఒత్తిళ్లను దూరం చేయటంలో బాగా తోడ్పడుతున్నట్టు తాజా అధ్యయంలో వెల్లడైంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే కుంగుబాటు ముప్పు సగానికి తగ్గుతుందనీ బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. అయితే ఖాళీగా ఉన్న సమయంలో శారీరకశ్రమ చేయటం వల్లనే మానసిక ఆరోగ్యం చేకూరుతుందని వివరిస్తున్నారు. సైకిల్‌ తొక్కటం వంటి పనులు ఒత్తిడిని దూరం చేయటానికి బాగా దోహదం చేస్తాయని.. కాబట్టి కుంగుబాటు, ఆందోళన సమస్యలకు చికిత్స చేయటంలో వీటిని తప్పకుండా చేర్చాలని అధ్యయనానికి నేతృత్వం వహించిన కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకుడు సామ్యూల్‌ హార్వే సూచిస్తున్నారు. మరీ చెమటలు కారిపోయేంతగా, శ్వాస చాలా వేగంగా తీసుకునేంత తీవ్ర స్థాయిలో వ్యాయామం చేయకపోయినా మెరుగైన ఫలితాలు కనబడుతుండటం విశేషం. తేలికపాటి వ్యాయామాలు చేసినవారిలోనూ కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు.

కుంగుబాటు (డిప్రెషన్‌) మీద అపోహలు

కుంగుబాటు (డిప్రెషన్‌) మీద చాలా అపోహలున్నాయి. ఇది స్త్రీలకే వస్తుందని కొందరు భావిస్తుంటారు. ఒకసారి కుంగుబాటు మొదలైతే అది జీవితాంతం వెంటాడుతుందని మరికొందరు అనుకుంటూ ఉంటారు. అసలు వీటిల్లోని నిజమెంత?

* అపోహ: కుంగుబాటు అనేది బలహీనతకు సూచిక.

* నిజం: కానే కాదు. ఇది ఒక మానసిక రుగ్మత. ఆత్మీయులు, సన్నిహితులు మరణించటం వంటి సంఘటనలు ఎదురుకావటంతో పాటు.. జన్యుపరమైన అంశాలు కూడా దీనికి కారణమవుతాయి.

* అపోహ: కుంగుబాటు స్థితి నుంచి చాలామంది తమకు తాముగానే బయటపడతారు. చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు.

* నిజం: ఇది చాలా తీవ్రమైన ఆరోగ్యసమస్య. మందులు, కౌన్సెలింగ్‌ వంటి పద్ధతులతో చికిత్స తీసుకోవటం తప్పనిసరి. నిపుణుల సూచనల మేరకు పూర్తికాలం చికిత్స తీసుకోకపోతే కుంగుబాటు లక్షణాలు తిరగబెట్టే ప్రమాదమూ ఉంది.

* అపోహ: కుంగుబాటును తగ్గించే మందులు ప్రభావం చూపకపోతే.. ఇక అవి ఎప్పటికీ పనిచేయవు.

* నిజం: సాధారణంగా వీటిని వాడటం మొదలెట్టిన 2-4 వారాల తర్వాత ప్రభావం కనిపిస్తుంటుంది. దీనిని గుర్తించటానికి కొంత సమయం పడుతుంది.

* అపోహ: ఇది కేవలం మహిళలకే వస్తుంది.

* నిజం: కుంగుబాటు పురుషులకూ వస్తుంది. కాకపోతే మగవారిలో కన్నా స్త్రీలల్లోనే అధికం.

* అపోహ: డిప్రెషన్‌ కూడా అప్పుడప్పుడు మూడ్‌ మారటం లాంటిదే.

* నిజం: మూడ్‌ మారటమనేది ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటుంది. అయితే డిప్రెషన్‌ దీర్ఘకాలం వేధించే సమస్య. ఇది చదువులు, ఉద్యోగాల్లో ముందుకు వెళ్లకుండా చాలా చిక్కులను తెచ్చిపెడుతుంది.

13/12/2020

వ్యాకులత లేదా డిప్రెషన్ మానసిక తుగ్మతల లో ముందుగా చెప్పుకోవలసిన వ్యాది . ఈ వ్యాధి కి గురి అయ్యే వారిసంఖ్యా చాల ఎక్కువ . మనిషి మానసిక స్థాయిల్లో కొన్ని ప్రత్యెక లక్షణాల తో కూడి సంభవించే వ్యాధి " డిప్రషన్ " . డిప్రషన్ కి లోనయిన వ్యక్తులు దైనందిన జీవితం లో ఎ పనిని సమర్ధవంతంగా నిర్వహించలేరు .
కొన్ని ప్రత్యెక కారణాల వలన కలిగే
దు:ఖము ,
దురద్రుస్థము ,
నైరాశ్యం ,
అమితం గా ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం ,
వ్యాకులపడటానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి -
ఆరోగ్య సమస్యలు,
పరీక్షలలో ఫెయిల్‌ కావడం,
ఆత్మీయులు మృతి చెందడం,
ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి.
వంటి సంఘటనలు మనిషిని వ్యాకులతకు లోను చేస్తాయి . ఇటువంటి సంఘటనలు ప్రతి వ్యక్తీ జీవితంలో ఎప్పుడోఒకసారి అనుభవిస్తూనే ఉంటాడు . అనటువంటి సందర్భాలలో ఆవేదన చెందడం సహజమే .
ఎ ఒక్కరి జేవితమూ ఎల్లప్పుడూ ఆనందదాయకం గా ఉండాలను కోవడం పొరపాటు . విచారము , దిగులు కలుగని వ్యక్తులు సమాజం లో ఉండకపోవచ్చు . మససు దిగులుగా ఉన్నంత మాత్రాన . సంతోషం లేనంత మాత్రాన ఆ వ్యక్తీ డిప్రెషన్ కి లోనయ్యాడని భావించ కూడదు .
కారణాలు :
డిప్రెసన్ అనేది వంశపారంపర్యం గా వచ్చే జబ్బు . డిప్రెషన్ కు కారణమయ్యే కారణాలు మానసికమైనవి మాత్రమే కానవసరం లేదు . ఇన్ఫెక్షన్ , ఫ్లూ . తదితర వైరస్ వ్యాధులు మొదలైనవి కుడా తాత్కాలికంగా డిప్రెషన్ కి కారణమవుతుంటాయి . డిప్రెషన్ కు లోనయే నైజం ఉన్న వ్యక్తులు కు ఆత్మన్యూనతా భావం ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది . వీరిలో నిరాశ అత్యధికంగా ఉంటుంది . ఏ విషయాల పై ఆసక్తి ఉండదు . డిప్రెషన్ లక్షణాలు అందరిలొనూ ఒకే మదేరిగా ఉండవు . కొంత మందిలో నిద్ర తక్కువైతే , మరికొంతమందిలో నిద్ర ఎక్కువగా ఉంటుంది . కొందరికి ఆకలి ఎక్కువైతే ... మరి కొందరికి ఆకలే ఉండదు . మానియాడిప్రెషన్ అనే మరో రకం డిప్రెషన్ కి గురైన వారికీ 'విపరీతమైన ' ఆవేశం ఉంటుంది . వీరు కొంతసేపు విపరీతంగాకృంగిపోయి ఉంటారు ... మరికొంతసేపు ఏంతో ఆనందం గా కనిపిస్తారు .
డిప్రెషన్ కి గురైన వ్యక్తుల్లో కనిపించే మరొక తీవ్ర పరిణామం " ఆత్మహత్యా తలంపు " ... జీవతం వృదా అనే ఆలోచన వీరి మదిలో అధికంగా ఉంటుది . ఎవ్వనం దశలో డిప్రెషన్ కు గురైన వ్యక్తులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు . డిప్రెషన్ గురైన వ్యక్తులకు మానసిక వైద్య నిపులతో చికిత్స తీసుకోవడం మంచిది .

కొన్ని లక్షణాలు :
నిద్రపట్టకపోవడం ,
భయము ,
ఏకాంతజీవనము ,
మానసిక అస్థిరత ,
అలసట ,
అనాసక్తి ,
విసుగు ,
కోపము ,
ఆలోచించలేకపోవడం ,
బరువు తగ్గడం ,
జీవితము వ్యర్ధమనే భావన ,
రోజంతా విచారముగా కనిపించడం ,
చనిపోవాలనిపించడము ,

చికిత్స
భావనల వ్యక్తీకరణ: డిప్రెషన్‌కు గురైన వ్యక్తి తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో తన భావనలను పంచుకోవాలి. స్వల్ప స్థాయి డిప్రెషన్‌ కేసులలో ఈ విధమైన చర్య ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు - వివాహ బంధానికి సంబంధించిన సమస్యల వలన డిప్రెషన్‌కు గురైతే కౌన్సెలింగ్‌ విధానం ద్వారా సమస్యను పరిష్కరించి, డిప్రెషన్‌నుంచి బైటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
మందులు : డిప్రెషన్‌కు గురైన రోగులకు యాంటి డిప్రెసెంట్‌ ఔషధాల ద్వారా చికిత్స చేస్తారు. ఈ ఔషధాలు సురక్షితమైనవి. ఎంతో శక్తివంతంగా పని చేస్తాయి. ఈ ఔషధాలకు అలవాటుపడటం జరుగదు. వాటి వలన దుష్ఫలితాలు సంభవించవు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలిగించవు.

అయితే, ఈ మందులను ఇతర మందు లతో కలిపి తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కనుక వీటినివాడవలసి వచ్చినప్పుడు వైద్యపర్యవేక్షణలో ఉపయోగించడం మంచిది.
డిప్రెషన్‌కు గురైన వ్యక్తులు సాధారణ చికిత్సా ప్రక్రియలకు స్పందించని సమయంలో కొన్ని ప్రత్యేక చికిత్సలవసరం అవుతాయి. ఇటువంటి వారిని సైకియాట్రిస్టుల వద్దకు చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సైకియాట్రిస్టుల వద్దకు తీసుకువెళ్లినంత మాత్రం చేత వారిని 'పిచ్చివాళ్లుగా జమకట్టాల్సిన అవసరం లేదు.

స్వయం సహాయం
డిప్రెషన్‌కు గురైన వారు తమకు తాము ఏ సహాయం చేసుకోగలుగుతారనే అంశాన్ని కూడా పరిశీలిద్దాం.
నిశ్శబ్దంగా ఉండవద్దు, ఒక వ్యక్తి డిప్రెషన్‌కు గురి కావడమనేది చాలా నెమ్మదిగా సాగుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులను అతడి/ఆమె కుటుంబ సభ్యులు కూడా దానిని గుర్తించలేకపోవచ్చు. అటువంటి సమయాల్లో ఆ వ్యక్తి మౌనం వీడి, తన భావోద్వేగాలను వివరించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఉపయుక్తమైన పనులు చేయడం : డిప్రెషన్‌నుంచి బైటపడటానికి శరీరానికి, మనస్సుకు ఉపయోగకరంగా ఉండే కొన్ని రకాల చర్యలు చేపట్టవచ్చు. ఉదాహరణకు నడక వంటి వ్యాయామ ప్రక్రియ చేపట్టవచ్చు. మందిరాలకు వెళ్లి రావచ్చు. స్నేహితులతో కొంతసేపు ముచ్చటించవచ్చు. 'ఇది నయం కాదేమోననే భావన కలుగనీయకూడదు.

భోజనం చేయాలని అనిపించకపోయినా సమతులాహారం తీసుకోవడం అత్యవసరం. మద్యాన్ని సేవించాలని, నిద్ర మాత్రలను వేసుకోవాలనే భావనను దరి చేరనీయవద్దు. డిప్రెషన్‌కు లోనైనప్పుడు దానిని నయం చేయవచ్చు నని గుర్తుంచుకోండి.

13/12/2020

హాయిగా నిదురపోవడానికి చిట్కాలు


ఉరుకుల పరుగుల జీవితం. ముంచుకొస్తున్న సమస్యలు. ఎన్నో నిద్ర లేని రాత్రులు. ఇవన్నీ మనసును పట్టి పీడిస్తుంటాయి. నిద్ర లేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచనా గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనికి పరిష్కారం తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది అంటున్నారు నిపుణులు.

* నిద్రపోవడానికి ఒక సమయం నిర్దేశించుకోండి. ఒక్కోసారి ఒక్కోలా నిద్రకు ఉపక్రమించడం వల్ల శరీరం క్రమగతి కోల్పోతుంది. ఫలితంగా పడుకోగానే నిద్ర పట్టదు. పగటి పూట కునుకు తీయడం చాలామందికి అలవాటు. అది కాసేపయితే సరే! అదే ఎక్కువ సమయమైతే రాత్రి నిద్రను హరించి వేస్తుంది. రోజంతా పనిచేసి విపరీతమైన అలసటతో విశ్రాంతి కోరుకుంటున్నప్పుడు ఓ పావుగంట, ఇరవై నిమిషాలు వరకు పగటి నిద్ర ఫరవాలేదు.

* శరీరానికి తగిన శ్రమ ఉంటే కంటి నిండా నిద్ర దొరుకుతుంది. రోజూ అరగంట సేపు వ్యాయామం తప్పనిసరిగా ఉండేట్లు దినచర్యను రూపొందించుకోండి. అలాని నిద్రపోయే ముందు ఏరోబిక్స్‌ చేయడం వల్ల శరీరం ఉత్తేజితమై నిద్ర పట్టకపోవచ్చు. అందువల్ల వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం మాత్రమే వ్యాయామం చేయాలి.

* నిద్రకు ఉపక్రమించే ముందు స్నానం చేయడం వల్ల కండరాలు విశ్రాంతి కోరుకుంటాయి. ఫలితంగా మంచి నిద్ర సొంతమవుతుంది. కనీసం పడుకోవడానికి రెండుగంటల ముందుగా భోజనం చేయండి. నిద్రకుపక్రమించే ముందు భోంచేయడం వల్ల మగతగా అనిపించినా, తరవాత మాత్రం జీర్ణం కాకపోవడం, కలత నిద్ర వంటివి ఇబ్బంది పెడతాయి.

* పడుకునే ముందు టీ, కాఫీ వంటి తేనీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే రాత్రి పడుకునే ముందు కాల్పనిక కథల పుస్తకాలను చదవండి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

* నిద్రించే గదిలోకి చల్లటి గాలి వచ్చేందుకు వీలుగా కిటికీలు తెరచి ఉంచండి. బెడ్‌ షీట్లు శుభ్రంగా ఉండేట్లు చూసుకోండి.

నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :

* రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
* రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
* రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
* రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
* పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
* పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
* పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
* నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
* నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,

* సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

o * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
o * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

o * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

o * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

13/12/2020

మీ పిల్లలు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో ఈ అలవాటు త్వరగా వ్యసనంలా మారే ప్రమాదమే కాదు.. దాంతో దుష్ఫ్రభావాలూ కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్‌ గేమ్‌లు పిల్లలకు దెబ్బలు తగలకుండా, వినోదం కలిగించే మాట నిజమే గానీ.. ఇతర ఆటల ద్వారా కలిగే సమష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవీ ఉండవని చెబుతున్నారు. ప్రస్తుతం కంప్యూటర్‌ గేమ్‌లకు అతుక్కుపోవటాన్ని ఒక వ్యసనంలా గుర్తించకపోయినప్పటికీ వీటికి ఆకర్షితులవుతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతుండటం పట్ల నిపుణులు, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పిల్లలు ఏకాకులుగా మారతున్నారని.. కుటుంబ సభ్యులతో గడపటం, వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్నారని భయపడుతున్నారు.

ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు రోజులో 6 నుంచి 8 గంటలసేపు కంప్యూటర్‌ గేమ్‌ల్లో మునిగిపోవటం సాధరణమైపోతోంది. దీంతో కొందరిలో దుష్ఫ్రభావాలూ తలెత్తే అవకాశమూ ఉంది. వాటిల్లో కొన్ని..
* మణికట్టు వద్ద కండరాల నొప్పి
* మెడనొప్పి
* కుంగుబాటు
* భావోద్రేకాల్లో మార్పులు
* గేమ్‌లను ఆడొద్దంటే కోపంతో రెచ్చిపోవటం
* కుటుంబంలో, బయటా జరితే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం
* స్నేహితులతో చనువుగా మెలగకపోవటం
* భోజనం కూడా తమ గదిలోనే కానిచ్చేయటం
* హోంవర్క్‌ పూర్తి చేయకపోవటం
* తరగతుల్లో పాఠాల పట్ల శ్రద్ధ చూపకపోవటం

కంప్యూటర్‌ గేమ్‌ల్లో మునిగిపోయిన పిల్లలు నలుగురిలోకి రావటానికి సిగ్గుపడుతున్నా, ఆందోళనతో కనిపిస్తున్నా ముప్పు పొంచి ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇవి వారి మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే కంప్యూటర్‌ గేమ్‌లకు పిల్లలు ఎక్కువగా అతుక్కుపోతున్నట్టు గమనిస్తే వాటి నుంచి దృష్టి మళ్లించటానికి వెంటనే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* ఇలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువసేపు మాట్లాడుతుండాలి.
* కంప్యూటర్‌ వాడకంలో ముందే పరిమితి విధించాలి.
* అందరూ తిరిగే ప్రాంతంలోనే కంప్యూటర్‌ను ఉంచాలి.
* అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారన్నదీ గమనిస్తుండాలి.
* కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవటమూ మంచిదే.
* పిల్లలతో కలిసి తరచూ షికార్లకు వెళ్తుండాలి.

13/12/2020

పిల్లల్లో విపరీత ప్రవర్తనలు పిల్లల ప్రవర్తనలో రెండు ప్రధాన భేదాలుంటాయి. వైద్యపరమైన కారణాల వలన వచ్చేవి మొదటి రకం. పెంపకంలో లోపాల వలన కనిపించే విపరీత ప్రవర్తనలు రెండవ రకానికి చెందినవి.. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మన పిల్లలు మనకు ఎంతగా ఇష్టమైనప్పటికీ, ఏదో ఒక సందర్భంలో వారి ప్రవర్తన ఇబ్బందిని, చిరాకును, అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తుంది. ఇలా జరిగినప్పుడు కోపాన్ని, విసు గునూ ప్రదర్శించకుండా సమస్య ఏమిటనేది నిదానంగా ఆలోచించి తగిన రీతిలో స్పందించాలి. ముందుగా సమస్య నిజంగా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి.

మీ పాప నిజంగానే సమస్యాత్మకంగా ప్రవర్తి స్తుంటే నిద్రలో ఏమైనా భయంకరమైన కలలు వస్తున్నాయేమో ఆలోచించాలి. లేకపోతే కుటుంబంలోకి కొత్తగా తమ్ముడో, చెల్లెలో ప్రవేశించి మీ మొదటి చిన్నారిలో ఈర్ష్యాద్వేషాలను రగిలిస్తుండవచ్చు. అలాగే కొత్తగా ఇల్లు మారడం, ఆటలాడుకునే స్నేహితులు మారడం మొదలైనవన్నీ పిల్లల ప్రవర్తనలో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది.

ప్రతిరోజూ మీతోపాటు పడుకునే చిన్నారిని మీరు వేరే గదిలో పడుకోమంటే, కొత్త వాతావరణానికి అలవాటు పడక పేచీ పెడుతున్నదేమో గమనించాలి. లేదా మీ చిన్నారి అలిగిన ప్రతిసారీ మీరు మరీ ఎక్కువగా బుజ్జగిస్తుండవచ్చు. ఇది కూడా ఆ చిన్నారి ప్రవర్తనలో మార్పు తీసుకు వస్తుంది. అన్నిటికీ మించి మీ చిన్నారి సరిగ్గా ఏ సమయాల్లో విసుగెత్తించే విధంగా ప్రవర్తిస్తున్నదీ గమనించండి.తనకు విసుగ్గా, బోర్‌గా అనిపించినప్పుడా? ఉద్విగ్నంగా ఉన్నప్పుడా? ఆకలిగా ఉన్నప్పుడా? లేక నిద్ర వచ్చినప్పుడా? అనే దానిపై దృష్టిపెట్టండి.

ఏం చేయాలి?
కుటుంబం, ఆచార వ్యవహారాలు తదితర అంశాలనుబట్టి పిల్లల ప్రవర్తనలు, వారు సృష్టించే సమస్యలూ అటూ ఇటూగా మారుతుంటాయి. ఫలానా వారిలో ఒక సూచన పని చేసిందని అందరిలోనూ సరిగ్గా అదే మాదిరి పరిష్కారం పని చేయకపోవచ్చు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనా సమస్యలను కొద్దిపాటి సంయమనంతోనూ, ప్రయోగాలతోనూ పరిష్కరించుకోవాలి. మీకు ఏది సబబుగా ఉన్నదని తోస్తే అది చేయవచ్చు. కాకపోతే మీరనుకున్న పరిష్కార విధానాన్ని కొద్దికాలంపాటు కుదురుగా ఆచరించి చూడాలి. తండ్రి నయమం పెడితే తల్లి దానిని నీరు గార్చకూడదు.

అయితే ఎవరైనా సరే పిల్లలకు ఎప్పుడూ శాసనాలను చేయ కూడదు.
ఏది ఎందుకు చేయాలో, ఏది ఎందుకు చేయకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో వివరంగా, సోదాహరణంగా వివరించాలి. ఉదాహరణకు గోడమీదనుంచి తొంగి చూస్తున్నప్పుడు గబుక్కున వెళ్లి వాళ్లు భయపడేలా అదిలించకూడదు. అప్పటికి ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకుని, సందర్భం వచ్చినప్పుడు - ఉదాహరణకు పేపర్లో కానీ, సినిమాలో కాని ఎవరైనా పిట్టగోడ మీదనుంచి పడిపోయిన దృశ్యాన్ని చూసినప్పుడు, దానిని పిల్లల మనస్సుకు హత్తుకునే విధంగా నాటకీయతను జోడించి తెలియజెప్పాలి.
తప్పు చేసినప్పుడు దండించే కన్నా, మంచి చేసినప్పుడు గుర్తించి మెచ్చుకోవడమూ, ప్రోత్సాహపూర్వకమైన బహుమతులను ఇవ్వడమూ చేయాలి. ఏ పిల్లవాడిలోనూ దండించి సత్‌ప్రవర్తనను నేర్పలేము. ముందుగా మనం ఆచరించి నేర్పించాలి. అలాగే ప్రేమాప్యాయతలను ఇవ్వడమూ, పుచ్చుకోవడమూ నేర్పించాలి.

ఆహారం తీసుకునేప్పుడు పేచీ
తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదని వాపోతుంటారు. దీనికి రెండు కారణాలుంటాయి. ఒకటి- పిల్లలు భోజన వేళల మధ్యలో చిరుతిండ్లు తింటూ ఉండవచ్చు. లేదా వారికి నిజంగా ఆకలి తగ్గిపోయి ఉండవచ్చు.
భోజనం సంతృప్తిగా తిన్న తరువాతనే అవసరమనుకుంటే చిరుతిండ్లను పెట్టాలి. అన్నానికి ముందు ఏ రకమైన చిరుతిండ్లూ పెట్టకూడదు. పిల్లలకు బలవంతంగా ఏదీ తినిపించకూడదు. అలా చేస్తే పిల్లలు వారంతట వారు తినే ప్రయత్నం చేయరు. దీని వల్ల పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ అసహనానికి గురి కావలసి వస్తుంది.

మీరు దేనినైతే నియంత్రిస్తారో, పిల్లలు దానినే ఇష్టపడతారు. ఉదాహరణకు బంగాళా దుంపల చిప్స్‌ తినకూడదని మీరు కట్టడి చేస్తే, రుచిగా ఉన్నా లేకపోయినా పిల్లలు అవే కావాలని మారాం చేస్తారు. పిల్లలకు పెద్ద ప్లేటులో ఆహారాన్ని కొద్దిగానే పెట్టి, దానిమీద ఆసక్తిని కలిగించాలి. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులు తప్పితే మిగతా ఎవరు తినిపించినా కిమ్మన కుండా తింటారు. మీ పిల్లలు మీ ఇంట్లో కాకుండా, పొరుగింట్లో ఎందుకు ఆనందంగా తింటారనే దానికీ, తాతయ్య, అమ్మమ్మల దగ్గరో, చుట్టాల ఇంట్లోనో ఎందుకు ఇష్టంగా తింటారనే దానికి సమాధానం పిల్లలు మార్పు కోరుకోవడమే.

మీ పిల్లలు ఏదో ఒక పదార్థానే ఇష్టప డుతూ,ఎప్పుడూ దానినే కోరుకుంటూ ఉంటే, కొంతకాలంపాటు దానినే తినిపించడంలో తప్పు లేదు. కాకపోతే, మధ్య మధ్యలో కొత్త రకమైన ఆహార పదార్థాలను ప్రవేశపెడుతుం డాలి. మళ్లీ మళ్లీ చెప్పేదేమిటంటే పిల్లలు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. మనం దానిని గుర్తిస్తే చాలు.పెరుగులోకొంచెం శొంఠిపొడిని, సైంధవ లవణాన్ని కలిపి పిల్లలకు తినిపిస్తే ఆకలి పెరు గుతుంది. భోజనానికి ఒకటి రెండు గంటల ముందు బెల్లం పానకానికి మిరియాల పొడిని చేర్చి తాగిస్తే కూడా ఆకలి వృద్ధి అవుతుంది.

13/12/2020

మీకు సెల్‌ఫోన్ ఉందా? ఉంటే ఓకే... మీరు మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడకపోతే...కొనడం ఎందుకు? ఓకే... మీరు మరీ ఎక్కువ మాట్లాడతారా?
‘అవును’ అనే సమాధానం వస్తే మాత్రం నాట్ ఓకే. సెల్‌ఫోన్ మీ ఒత్తిడిని పెంచుతున్న విషయం తెలుసా?

మీ చేతిలో సెల్ ఉందా! అయితే మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లే! సెల్ ఉంటే ఎంజాయ్ చేస్తారు కానీ, ఒత్తిడేమిటా అనుకుంటున్నారా! ఇది నూటికి నూరుపాళ్లు ఒత్తిడే అని మనోవిశ్లేషకులు, మేధావులు పదేపదే చెబుతున్నారు. ఒక్కసారి మీ ఫోన్ గురించి ఆలోచించుకోండి! మీకు తెలియకుండా మీరు ఏ విధంగా ఒత్తిడి ఫీల్ అవుతున్నారో పరిశీలించుకోండి!

సెల్‌ఫోన్స్ వినియోగం వల్ల పనికి, ఇంటికి మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అందువల్ల ఇంట్లోనూ, ఆఫీసులోనూ కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఆఫీసులో ఉన్న ఇబ్బందులను సెల్‌ఫోన్ కారణంగా ఇంటి వరకు తీసుకువస్తున్నారు. అందువల్ల వ్యక్తులలో వ్యతిరేక ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో స్త్రీలు ఎక్కువ బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. వీటి వాడకం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనవ్వడమే కాకుండా కుటుంబసంతోషం కూడా తగ్గిపోతోంది.

పెరిగిన సాంకేతిక నైపుణ్యం మనిషిని మరింత అభివృద్ధి చెందేలా చేస్తున్నప్పటికీ, మానసిక అశాంతి మాత్రం విపరీతంగా పెరుగుతోంది. ‘జర్నల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ’ మ్యాగజీన్... ‘‘సెల్‌ఫోన్ వాడకం ఎంత ఎక్కువైతే, కుటుంబ సంతోషం అంత తక్కువ అవుతుంది, అందువల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది’’ అని ఒక వ్యాసంలో తెలిపింది.

మీకు తెలుసా?...ఈఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

సెల్ ఫోన్ వల్ల కాన్సన్‌ట్రేషన్ దెబ్బ తింటుంది. పని చేస్తున్నప్పుడు ఫోన్ రావడం వల్ల ఏకాగ్రత పోయి, ప్రొడక్టివిటీ రాదు. పని సకాలంలో పూర్తిచేయలేకపోయామన్న బాధతో ఒత్తిడికి లోనవుతారు.

ఏ పని చేస్తున్నా ఫోన్ మోగినట్లే ఫీలవుతుంటారు. ఫోన్ మోగగానే ఎవరైనా టీజ్ చేస్తున్నారేమోనని భయానికి లోనవుతారు.

అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తాయేమోనని టెన్షన్ పడుతుంటారు. ఫోన్‌ను స్విచాఫ్ చేయలేక, ఆన్‌లో ఉంచలేక ఒత్తిడి ఫీల్ అవుతారు.

ఫోన్స్‌లోనే ఇంటర్నెట్ రావడం వల్ల చిన్న స్క్రీన్ మీదే ఫేస్ బుక్, చాటింగ్ చేస్తూ 24 గంటలూ అందరితో కనెక్టెడ్‌గా ఉండటానికి ప్రయత్నం చేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది.

అదేపనిగా మోనిటర్ చూస్తూండటం వల్ల కంటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది.

ఫోన్ కొన్న వారానికే ఔట్ డేట్ అయిపోతే, ‘‘అయ్యో అనవసరంగా ఇంత ఖర్చుపెట్టానే’’ అని నిందించుకుని, మళ్లీ కొత్తది కొనాలనుకుంటారు. అది కొనేటప్పుడు, ‘కనీసం ఇదైనా ఎక్కువ రోజులు లేటెస్ట్‌గా ఉంటుందా?’ అని ఒత్తిడికి లోనవుతారు.

పూర్వం రోజులలో ల్యాండ్‌లైన్ మాత్రమే ఉండటం వల్ల, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో కుటుంబ సభ్యులకు తెలిసేది. రహస్యాలు ఉండేవి కాదు. కాని సెల్‌ఫోన్ వల్ల రహస్య సంభాషణలు జరుగుతున్నాయి. మాట్లాడేవారికి ఎవరైనా వింటారేమోననే ఒత్తిడి, వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారోనని గమనిస్తున్న వారిలో ఒత్తిడి.

అదేపనిగా ఫోన్ మాట్లాడటం వల్ల రేడియేషన్ ప్రభావం శరీరం మీదే కాక మనసు మీద కూడా పడి ఒత్తిడికి దారితీస్తుంది.

సెల్‌ఫోన్ పుణ్యమా అని పక్కనే ఉన్నవారితో మాట్లాడకుండా, దూరాన ఉన్నవారితో మాట్లాడటం ఎక్కువయ్యింది. అందువల్ల బంధాలు చెడిపోతున్నాయి. కొందరు తమ కాలక్షేపం కోసం, అవతలివారు ఏ స్థితిలో ఉన్నారో కూడా గమనించకుండా ఫోన్ చేస్తారు. రిసీవ్ చేసుకున్నవాళ్లు ఆ సమయంలో పనుండి మాట్లాడలేకపోవటం వల్ల వారి మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. అయితే... రానున్న తరాలవారు మాత్రం ఈ విషయంలో ఒత్తిడికి లోను కాకపోవచ్చు. వారి జీవితమే వీటితో ప్రారంభం అవుతోంది కాబట్టి, సెల్ లేని జీవితాన్ని, దాని వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను వారు ఊహించలేరు... అని మిల్వాకూలోని యూనివ ర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నోయెల్లీ చెస్లీ చెబుతున్నారు.

ఆధునిక టెక్నాలజీని సాదరంగా ఆహ్వానించాలి. సెల్‌ఫోన్ అనేది జీవితంలో భాగంగా మారిపోయింది. అందుకే దానిని అవసరానికి మాత్రమే వినియోగించుకుంటూ, ఒత్తిడిలేని, ఆనందమయమైన జీవితాన్ని గడపటం మంచిది.

కుటుంబ సభ్యులందరికీ ఎవరి ఫోన్ వారికి ఉండటంవల్ల కుటుంబంలో సంబంధాలు, అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అందరూ ఒకేచోట కూర్చున్నప్పుడు, కొందరు తమ గొప్పదనం ప్రదర్శించటానికి, పాపులారిటీ నలుగురికీ తెలియచెప్పుకోవడానికి అవసరం ఉన్నా, లేకపోయినా సెల్‌ని ఎక్కువ వాడతారు. అది ఒక ఎడిక్షన్ కాబట్టి దాని నుంచి బయటపడలేకపోతారు. ఇది ఒత్తిడికి దారితీస్తుంది.

Address

Tanuku
534211

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+919703243222

Alerts

Be the first to know and let us send you an email when Cnp Tanuku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Cnp Tanuku:

Share

Category